● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు: యోగ ప్రతి ఒక్క వ్యక్తి దైనందిన జీవితంలో భాగంగా మారాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక మినీ స్టేడియంలో శుక్రవారం స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన సామూహిక యోగ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పతంజలి యోగ రాష్ట్ర అధ్యక్షుడు గంధవళ్ల బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో యోగాసనాలు వేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ కార్యక్రమం జిల్లాలోని 6,458 ప్రదేశాల్లో సుమారు 11 లక్షల మందితో ఒకే సమయంలో యోగ కార్యక్రమం నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ యోగ గొప్పతనాన్ని తెలియ చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గాయకుడు నూకతోటి శరత్ కుమార్ రూపొందించిన యోగ గేయాన్ని కలెక్టర్ ఆవిష్కరించగా గేయాన్ని శరత్ ఆలపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్రావు, బీఎన్ విజయ్కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డీఆర్డీఏ, మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, ఆయుష్ శాఖ ఆర్డీడీ పద్మజాతి, డీఈఓ కిరణ్ కుమార్, పశు సంవర్థక శాఖ జేడీ రవి కుమార్, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, డీఎస్డీఓ రాజరాజేశ్వరి, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
దైనందిన జీవితంలో యోగ భాగంగా మారాలి
దైనందిన జీవితంలో యోగ భాగంగా మారాలి