
బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలి
ఒంగోలు సబర్బన్: రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు, అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, పీఎం సూర్యఘర్ యోజన పథకం లబ్ధిదారులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.25,045.91 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.20,591.18 కోట్లుగా నిర్ణయించగా, 2025 మార్చి 31వ తేదీ నాటికి రూ.25,444.91 కోట్ల రుణాలు అందజేశారన్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో పంట రుణాలకు సంబంధించి ఖరీఫ్లో రూ.4197.42 కోట్లు, రబీలో రూ.6040 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. జిల్లాలో పశు, మత్స్య సంపదను వృద్ధి చేసేలా రుణాలు అందజేయాలని కోరారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రమేష్, డీఆర్డీఏ, మెప్మా పీడీలు నారాయణ, శ్రీహరి, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, రవి కుమార్, శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున నాయక్, సీపీడీసీఎల్ ఎస్.ఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరానికి బ్యాంకుల రుణ లక్ష్యం రూ.25,045.91 కోట్లు
బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా