
క్రిటికల్ సర్జరీ.. కవలలు సురక్షితం
కంభం: నెలలు నిండక ముందే తీవ్ర రక్తస్రావంతో కంభంలోని సామాజిక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఓ గర్భిణికి గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతిబాయి సర్జరీ చేసి కవల పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. గిద్దలూరు మండలం క్రిష్ణంశెట్టిపల్లి గ్రామానికి చెందిన జ్యోత్స్న అనే గర్భిణికి గురువారం అర్ధరాత్రి తర్వాత రక్తస్రావమవుతుండటంతో కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆమె గర్భం దాల్చి 34 వారాలు నిండాయి. ప్రసవానికి ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అయితే గురువారం రాత్రి ఒక్కసారిగా రక్తస్రావం కావడంతో ఆందోళన చెందిన ఆమె.. కుటుంబ సభ్యుల సహకారంతో ఆస్పత్రికి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అనస్తీషియా వైద్యుడు శివనాయక్తో కలిసి గైనకాలజిస్టు సర్జరీ నిర్వహించారు. కవలలతోపాటు తల్లి క్షేమంగా ఉండటంతో వైద్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.