విద్యుదాఘాతంతో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

Jun 10 2025 6:53 AM | Updated on Jun 10 2025 6:53 AM

విద్య

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

తాళ్లూరు: విద్యుదాఘానికి గురై యువకుడు మృతి చెందిన సంఘటన తాళ్లూరు మండలంలోని రాజానగరం గ్రామంలో ఆదివారం రాత్రి వెలుగు చూసింది. గ్రామ సర్పంచ్‌ షేక్‌ వలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్‌ మహమ్మద్‌ అనీఫ్‌ కుమారుడు నాగూర్‌ బాషా(21) మసీద్‌పై క్యూరింగ్‌ చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులంతా సముద్ర స్నానాలకు వెళ్లారు. వారి వెంట నాగూర్‌ బాషా వెళ్లకపోవడంతో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వెంట ఉండి ఉంటాడని భావించారు. కానీ అక్కడా లేడని తెలియడంతో రాత్రి పొద్దుపోయే వరకు గాలించారు. చివరగా మసీద్‌పైకి వెళ్లి చూడగా అక్కడ విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సోమవారం గ్రామానికి చేరుకుని యువకుడి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, ఎంపీటీసీ మేడగం వెంకటరామిరెడ్డి, సర్పంచ్‌ షేక్‌ వలి, జెడీటీసీ మాజీ సభ్యుడు లోకిరెడ్డి వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

బండ పందెంలో వైఎస్సార్‌ కడప గిత్తల సత్తా

రాచర్ల: మండలంలోని యడవల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో వైఎస్సార్‌ కడప జిల్లా ఎడ్ల జతలు తొలి రెండు బహుమతులు సాధించి సత్తా చాటాయి. వైఎస్సార్‌ జిల్లా చౌటపల్లి గ్రామానికి చెందిన మార్తాల చంద్ర ఓబుల్‌రెడ్డి ఎడ్లు నిర్ణీత 20 నిమిషాల్లో బండను 4 వేల అడుగులు లాగి మొదటి బహుమతి రూ.1,00,116ను, మరో ఎడ్ల జత 3,615 అడుగులు లాగి రెండో బహుమతి రూ.80 వేలు సొంతం చేసుకున్నాయి. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గుప్రమానదిన్నె గ్రామానికి చెందిన కుందూరు రామ్‌భూపాల్‌రెడ్డి ఎడ్ల జత 3587 అడుగులు లాగి మూడో బహుతి రూ.60 వేలు, బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి చెందిన పావులూరి వీరయ్యస్వామి చౌదరి ఎడ్ల జత 3557 అడుగులు లాగి నాలుగో బహుమతి రూ.40 వేలు, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన అత్తోట శిరీష చౌదరి ఎడ్ల జత 3455 అడుగులు లాగి ఐదో బహుమతి రూ.20 వేలు, నంద్యాల జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన గొటిక హేత్విక్‌రెడ్డి ఎడ్ల జత 3,383 అడుగులు లాగి ఆరో బహుమతి రూ.15 వేలు, అనంతపురం జిల్లా గార్లదిన్నె గ్రామానికి చెందిన కె.రామాంజనేయులు ఎడ్ల జత 3,344 అడుగులు లాగి ఏడో బహుమతి రూ.10 వేలు, వైఎస్సార్‌ జిల్లా పత్తూరు మండలం బాజీపేట గ్రామానికి చెందిన కవ్వ బాలయ్య ఎడ్ల జత 3,279 అడుగులు లాగి ఎనిమిదో బహుమతి రూ.5 వేలు పొందాయి. విజేతలకు ఆలయ కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు.

తెలుగు యువత

డిష్యుం.. డిష్యుం!

యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలోని ఆర్‌.ఉమ్మడివరం గ్రామంలో తెలుగు యువత మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘర్షణలో వక్కమూడి ప్రేమ్‌బాబు తీవ్రంగా గాయపడి వై.పాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మరొక యువకుడు నెహిమియాకు కనిపించని గాయాలయ్యాయని తెలిసింది. క్రికెట్‌ ఆడే సమయంలో ఇరు జట్ల మధ్య ఘర్షణ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ముందుగా విద్యాసాగర్‌కు చెందిన టీం బ్యాటింగ్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రేమ్‌ బాబు టీం తమకంటే ఎక్కువ స్కోర్‌ చేసి గెలుస్తుందన్న ఆలోచనతో విద్యాసాగర్‌ టీం వాగ్వివాదానికి దిగింది. వ్యవహారం చినికిచినికి గాలివానలా మారడంతో ఇరు జట్లు భౌతిక దాడులకు దిగాయి. ఇరుజట్లలో ఉన్న సభ్యులు టీడీపీ వర్గానికి చెందిన వారు కావడంతో ఈ దాడిని ఎవరూ పట్టించుకోలేదు. ప్రేమ్‌బాబు తలకు గాయంకావడం, చికిత్స నిమిత్తం వైద్యశాలలో చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇరువర్గాలు అధికార పార్టీకి చెందినవారు కావడం వలన ఈ కేసును ఏ విధంగా టేకప్‌ చేయాలో తెలియక పోలీసులు సతమతమవుతున్నట్లు సమాచారం. దాడికి పాల్బడిన విద్యాసాగర్‌, సాయి, పవన్‌కుమార్‌లపై ప్రేమ్‌బాబు వర్గీయులు కేసు పెట్టినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపారు.

విద్యుదాఘాతంతో  యువకుడు మృతి
1
1/2

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

విద్యుదాఘాతంతో  యువకుడు మృతి
2
2/2

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement