
దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు
ఒంగోలు సబర్బన్: దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అందజేశారు. స్థానిక ప్రకాశం భవన్లోని ఆమె చాంబర్లో 16 మంది దివ్యాంగులకు 2021–22 గ్రూప్–4 అంధుల విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. అందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులకు మాట్రన్ కం స్టోర్ కీపర్ 1 పోస్టుకు, 2022–23 సంవత్సరానికి గాను గ్రూప్–4 విభాగంలో బధిరులకు 1 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, టెక్నికల్ పోస్టుకు, క్లాస్–4 పోస్టుల విభాగంలో 10 పోస్టులకు అంధుల విభాగంలో ఆఫీస్ సబార్డినేట్ 2 పోస్టులకు, వాచ్మెన్ 2, సేవిక 1, బధిరుల విభాగంలో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ 1 పోస్టు, శారీరక అంగ వైకల్యం విభాగంలో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ 1 పోస్టు, కామాటి 1 పోస్టునకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.అర్చన, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ కార్మికుల వేతనం పెంచాలి
మార్కాపురం టౌన్: వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఇంజినీరింగ్ కార్మికులు మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సీఐటీయూ ఆధ్వర్యంలో మార్కాపురంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం రూ.21 వేలు నుంచి రూ.24,500కు వేతనం పెంచాలని, షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కార్మికులకు దక్కాల్సిన అన్ని ప్రయోజనాలు అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె.సుబ్బరాయుడు, హరి, కృష్ణ, పి.సలాంఖాన్, ఎంసీహెచ్ అల్లూరయ్య, ఎం చెన్నకేశవులు, రషీద్, టి.శ్రీను, మరియదాసు, శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.