
రైతులు రోడ్డెక్కితేనే సమస్యల పరిష్కారం
ఒంగోలు టౌన్: రైతులు రోడ్డెక్కి పోరాటాలకు దిగినప్పుడే సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అవుతాయని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్, మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు అన్నారు. స్థానిక మల్లయ్య లింగం భవనంలో బుధవారం ఏరువాక పౌర్ణమి రైతు సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ ఎలాంటి సమస్యనైనా పోరాటాల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయన్నారు. ఉత్తర భారత దేశంలోని రైతుల్లో ఉన్న ఐక్యత ఆంధ్రప్రదేశ్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కులాలు, మతాలు, రాజకీయాల పేరుతో పాలకులు విడదీసి పాలన చేస్తున్నారని విమర్శించారు. రైతు నాయకుల పేరుతో కొందరు బ్రోకర్లు కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారి రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో రైతన్నల పట్ల అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. ప్రధాని మోడీ మాటలకు, చేతలకు పొంతన లేదని, ఢిల్లీ రైతాంగ ఉద్యమం సమయంలో రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా దగా చేశారని ధ్వజమెత్తారు. విదేశాల్లో పరిశ్రమలకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. దేశంలో రైతులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలేదని, పొగాకు, మిర్చి, శనగ, వరి, కంది, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. సులభతర వాణిజ్యం చేసుకునేందుకు కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులకు సులభంగా వ్యవసాయం చేసుకునేందుకు ఎందుకు సహకరించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. వేలకోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచిపోతున్న కార్పొరేట్లపై ఉన్న ప్రేమ రైతులపై ఎందుకు లేదో చెప్పాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి మాట్లాడుతూ పంటల బీమా పథకం రైతాంగ సొమ్మును బీమా కంపెనీలకు దోచిపెట్టడానికి తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ నాగమోతు వేణుగోపాలరావు, కోటేశ్వరరావు, పెండ్యాల హనుమంతరావు, కోడూరి నాంచారులు, కె.వీరారెడ్డి, బీమవరపు సుబ్బారావు, చుంచు శేషయ్య, జుజ్జురి జయంతి బాబు, చావలి సుధాకర్, ఏంఎ సాలార్, ఉప్పుటూరి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
ఏరువాక పౌర్ణమి రైతు సదస్సులో
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు