పచ్చ మూకల పైశాచికత్వం | Failed attempt to disrupt YS Jagan tour in Podili | Sakshi
Sakshi News home page

పచ్చ మూకల పైశాచికత్వం

Jun 12 2025 4:27 AM | Updated on Jun 12 2025 4:27 AM

Failed attempt to disrupt YS Jagan tour in Podili

పొదిలిలో వైఎస్‌ జగన్‌ పర్యటన భగ్నానికి విఫలయత్నం 

రైతులకు మద్దతుగా నిలవడంపై టీడీపీ అక్కసు 

కాన్వాయ్, రైతులపైకి చెప్పులు, రాళ్లతో దాడి

పోలీసులను అడ్డు పెట్టుకొని నిరసన డ్రామా 

ఆందోళనకారులకు పోలీసుల సహకారం 

వారిని నియంత్రించాల్సింది పోయి రైతులపై ప్రతాపం 

పూర్తిగా సంయమనం పాటించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రజలు నీరాజనం పలకడంతో సీఎం చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌కు వణుకు పుట్టింది. అనూహ్యంగా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తుండటం చూసి కన్ను కుట్టింది. ఎలాగైనా సరే జగన్‌ పర్యటనను అభాసుపాలు చేయాలని కుట్రకు తెర లేపారు. ఇందుకు పోలీసులూ సహకరించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు  పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్‌ఎస్‌ఆర్‌ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు. 

అక్కడ నుంచి 2.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొగాకు వేలం కేంద్రానికి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. టీడీపీ నాయకుడు గుణిపూడి భాస్కర్‌ ఇంటి వద్ద 200 మంది పచ్చ మూకలు కాపు కాశారు. ర్యాలీ పట్టణంలోకి ప్రవేశించగానే ఖాళీ కుండలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. అక్కడ నుంచి ర్యాలీ నవాబ్‌ పేటకు చేరుకోగాని మరో పచ్చ గుంపు రోడ్డుపైకి చొచ్చుకొచ్చింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం వెంట తెచ్చుకున్న రాళ్లతోపాటు జగన్‌ కాన్వాయ్‌ మీదకు చెప్పులు విసిరారు.  

ఉన్నట్లుండి ఒక్కసారిగా రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల పైకి రాళ్లు, చెప్పులు విసరడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో ముందుగానే తిష్ట వేసిన పచ్చ మూకలు.. డాబాల మీద నుంచి, ఇళ్లలోని కిటీకీల నుంచి రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్, కొందరు రైతులు, కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. రాళ్ల దాడి చేసిన పచ్చ మూకలను వదిలిపెట్టి.. రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఇదంతా ఒక ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసుల మద్దతుతోనే రాళ్ల దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు.  

నిరసనలకు పోలీసుల అనుమతి  
వైఎస్‌ జగన్‌ పోరుబాట ర్యాలీ జరుగుతున్న సమయంలోనే టీడీపీ నిరసనలకు పోలీసులు అనుమతివ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలలుగా పొగాకు రైతులు గిట్టు­బాటు ధరలు రాక అల్లాడిపోతున్నారు. సరుకు కొనకుండా కంపెనీలు చేసిన కుట్ర­లకు మోసపోతున్నారు. కళ్లున్న కబోదిలా కూట­మి ప్రభుత్వం పొగాకు రైతులు, ఇతర రైతులను పట్టించుకోకుండా కంపెనీలకు అండగా నిలబడింది.

ఈ పరిస్థితిలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌ ర్యాలీగా వస్తున్న సమయంలోనే టీడీపీ నిరసనలకు పోలీసులు అనుమతి ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు రాళ్లను సిద్ధం చేసుకున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు. అధికార పార్టీతో కుమ్మక్కై పోలీసులు మిన్నకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో మాజీ సీఎం కాన్వాయ్‌ మీద చెప్పులు విసరడం, ర్యాలీకి వ చ్చిన రైతులు, కార్యకర్తల మీద రాళ్లు రువి్వతే పోలీసులు ఏం చేశారన్న ప్రశ్నలకు సమాధానం లేదు.   

డాబాల మీదకు రాళ్లు ఎలా వెళ్లాయి? 
పోరుబాట ర్యాలీకి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ర్యాలీ దృశ్యాలను టాప్‌ యాంగిల్‌లో ఫొటోలు తీసుకోవడానికి ప్రెస్‌ ఫొటోగ్రాఫర్లను పోలీసులు అనుమతించ లేదు. కానీ ర్యాలీ పొడవునా డాబాల మీద టీడీపీ కార్యకర్తలు కాపుకాశారు. ఇళ్లపై నుంచి ర్యాలీకి తరలివచ్చిన రైతుల మీదకు రాళ్లు రువ్వారు. అసలు డాబాల మీదకు రాళ్లు ఎక్కడ నుంచి వచ్చాయన్న ప్రశ్నకు పోలీసులే బదులివ్వాలి. స్పెషల్‌ బ్రాంచి పోలీసులు, ఇంటిలిజెన్స్‌ పోలీసులు ఏం చేసినట్లు? అంటే పోలీసుల మద్దతుతోనే పచ్చ మూకలు రాళ్ల దాడికి ప్లాన్‌ చేశాయని ఇట్టే స్పష్టమవుతోంది. 

పోరుబాటలో అడుగడుగునా పచ్చమూకలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించాయి. గో బ్యాక్‌ జగన్‌ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ మూకలు ఇంతగా కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పూర్తిగా సంయమనం పాటించారు. రైతుల సమస్యలు పరిష్కారం కావడం ఇష్టం లేని టీడీపీ నేతలే కుట్ర పూరితంగా వ్యవహరించడం  కనిపించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement