రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Jun 11 2025 7:49 AM | Updated on Jun 11 2025 9:15 AM

రక్షణ

రక్షణ కరువు

పసిమొగ్గలపై సైతం అఘాయిత్యాలు

కూటమి పాలనలో రెచ్చిపోతున్న మృగాళ్లు

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ

 

ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలు, లైంగిక దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఒంగోలు నగరంలో వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశయాప్‌ తీసుకువచ్చి మహిళలకు అండగా నిలిచారన్నారు. 

అర్ధరాత్రి సైతం మహిళకు ఎలాంటి కష్టం వచ్చినా క్షణాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పసి మొగ్గలపై సైతం అఘాయిత్యాలు పెరిగిపోయాయని, వారికి రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ చర్యలు శూన్యం కావడంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. పాఠశాలల్లో చదువులు చెప్పాల్సిన గురువులే కీచకులుగా మారడం శోచనీయమన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని ఆమె ధ్వజమెత్తారు. 

ఏడాదిలో ఒక్కసారి కూడా అమ్మఒడి ఇవ్వకపోవడంతో విద్యార్థులు చదువుకునేందుకు అవస్థలు పడుతున్నారని వాపోయారు. సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదువుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో చర్యలు తీసుకుంటే..నేటి కూటమి ప్రభుత్వం వాటిని అటకెక్కించిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని విస్మరించి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెనాలిలో యువకులపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం చూస్తుంటే ప్రజలకు రక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం విస్మరించిందని, దీంతో గిట్టుబాటు ధరలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆర్థికంగా చితికిపోతున్న పొగాకు రైతులకు అండగాా నిలిచేందుకు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పొదిలి వస్తున్నారన్నారు.

కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు నగరఅధ్యక్షులు కఠారి శంకరరావు, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మాధవి, పేరం ప్రసన్న, బత్తుల ప్రమీల, మేరీకుమారి, లక్ష్మీకాంతం, అప్సర్‌, రాజేశ్వరి, వాణి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

మహిళలపై పెచ్చుమీరిన దాడులు
మహిళలపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మండిపడ్డారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో ప్రతి రోజూ మహిళలపై, చిన్నారులపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళా హోం మంత్రి ఉండి కూడా ఆమె స్పందించకపోవడం దారుణమన్నారు. మా ప్రభుత్వ హయాంలో మహిళలకు జగన్‌ మోహన్‌రెడ్డి ధైర్యం ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతూ ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతోందని ధ్వజమెత్తారు. 

సాక్షి మీడియాపై దాడి చేయడం, కార్యాలయాల మీద దాడిచేయడం వంటి సంఘటనలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యంగం అమలు కావడం లేదని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు. అందుకే మహిళలకు రక్షణ కరువైందన్నారు. హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మహిళలపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా కనీస చర్యలు లేవన్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

రక్షణ కరువు1
1/2

రక్షణ కరువు

రక్షణ కరువు2
2/2

రక్షణ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement