
సత్తా చాటిన కృష్ణా జిల్లా ఎడ్లు
సింగరాయకొండ: పాతసింగరాయకొండ వరాహా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రస్థాయి రాధాడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో 12 జతల ఎడ్లు పాల్గొనగా కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామానికి ఎలిసెట్టి ఉమామహేశ్వరి, యనమలకుదురు గ్రామం వెలగపూడి కిరణ్ ఎడ్లు రూ.50 వేలు గెలుచుకున్నాయి. ద్వితీయ బహుమతి రూ.40 వేలను బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పగడవారిపాలెం గ్రామానికిచెందిన కుంచాల వేదశ్రీలతారెడ్డి ఎడ్లు, తృతీయ బహుమతి రూ.30 వేలను బాపట్ల జిల్లా చినగంజాం మండలం కడవకదురు గ్రామానికి చెందిన కొక్కు మహేశ్వర్రెడ్డి ఎడ్లు సాధించాయి.
స్కూలు, కాలేజీ బస్సులు ఫిట్నెస్
● జిల్లా ఉపరవాణా కమిషనర్ ఆర్.సుశీల
ఒంగోలు సబర్బన్: స్కూల్, కాలేజ్లు పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులను చేరవేసే బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయించుకోవాలని జిల్లా ఉప రవాణా కమిషనర్ ఆర్.సుశీల సూచించారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వెంటనే ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ)ను రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కోరారు. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ను వెంటనే చెల్లించాలన్నారు. పర్మిట్, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్, వాహనం నడిపే డ్రైవర్కు సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ను అమర్చాలని చెప్పారు. స్కూల్ బస్సు నడిపే సమయంలో డ్రైవర్ రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. 12వ తేదీ నుంచి జిల్లా అంతటా మోటార్ వాహన తనిఖీ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఫిట్నెస్ సర్టిఫికెట్, టాక్స్, పర్మిట్, ఇన్సూరెన్సు, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, రహదారి భద్రతా నియమాలను పాటించని స్కూలు, కాలేజీ బస్సుల వాహనాలకు అపరాధ రుసుం విధించి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.