
జగన్ పర్యటన భగ్నానికి కుట్ర
ఒంగోలు సిటీ: పొగాకు రైతులకు అండగా పొదిలి పట్టణానికి వచ్చిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి కార్యక్రమానికి వేలాదిగా రైతులు, ప్రజలు, అభిమానులు తరలిరావడాన్ని ఓర్చుకోలేక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆరోపించారు. అన్ని అనుమతులతో ప్రశాంతంగా ర్యాలీ జరుగుతుంటే తెలుగుదేశం పార్టీతో దాడులు చేయించి తిరిగి వైఎస్సార్ సీపీ వారిపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కాపురం వైపు నుంచి పొగాకు బోర్డుకు వెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులను కోరితే..వారు కావాలని కుటిల రాజకీయంతో దర్శి రూట్ నుంచి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్లోనే ర్యాలీ ప్లాన్ చేకున్నామని తెలిపారు. కానీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి ఆందోళన చేస్తున్న వారికి బందోబస్తు కల్పిస్తున్నట్లుగా పోలీసుల తీరు ఉందని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేని వారిని అక్కడకు ఎలా రానిచ్చారని పోలీసులను ప్రశ్నించారు. వేలాదిగా తరలివచ్చిన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని ఆరోపించారు. ర్యాలీకి వచ్చిన జనాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించారన్నారు. జడ్ప్లస్ కేటగిరి భద్రత కలిగిన వ్యక్తికి సరైన భద్రత కల్పించలేదన్నారు. శాంతి భద్రలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసికూడా పోలీసులు ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. నల్లబెలూన్లలో ప్రమాదర రసాయనాలు కలిపి విసిరితే పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ వారిని సైకోలు, గూండాలని బాధ్యత కలిగిన హోం మంత్రి పదవిలో ఉండి మాట్లాడడం తగదన్నారు. టీడీపీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని, చెప్పులు, రాళ్లు విసిరారని, పోలీసులపై కూడా రాళ్లు వేశారని తెలిపారు. కానీ చేసిందంతా టీడీపీ నేతలైతే పచ్చ పత్రికలు మాత్రం వైఎస్సార్ సీపీ వారు చేశారంటూ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. అన్ని అనుమతులు తీసుకుని ర్యాలీ చేస్తున్న సమయంలో వారిని అనుమతించక పోయి ఉంటే ఈ వివాదం తలెత్తి ఉండేది కాదని పోలీసులపై బూచేపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
పోలీసుల తీరు ఏకపక్షం
పోరుబాటలో అల్లర్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భారీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు, జెడ్ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి వస్తున్నపుడు ఆందోళన చేస్తున్న వారిని ఎందుకు నిలువరించలేక పోయారని నిలదీశారు. వేలాదిగా తరలివచ్చిన రైతులు, అభిమానులతో ర్యాలీ రెండు కిలోమీటర్లు ప్రశాంతంగా సాగిందని, కానీ ఆ ప్రాంతాల్లోనే ఎందుకు గొడవ జరిగిందని ప్రశ్నించారు. ముందే వారిని నిలువరించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. జగనన్న సైనికులుగా అందరూ సంయమనం పాటించడం వల్లే విషయం పెద్దది కాలేదన్నారు. టీడీపీ నాయకులు రాళ్లు రువ్వుతున్న వీడియోలు ఉన్నాయని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మా పై బురదజల్లుతూ పబ్బం గడుపుకోవాలని చూడడం అధికార పార్టీకి సరికాదన్నారు. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బొట్ల రామారావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ఖాన్, ప్రవీణ్కుమార్, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వేలాదిగా జనం తరలిరావడంతో ఓర్చుకోలేక కుట్రలు రాళ్లు, చెప్పులు రువ్వి కవ్వించింది టీడీపీ వాళ్లే దాడి చేసిన వారిని వదిలేసి వైఎస్సార్ సీపీ వారిపైనే కేసులా కేసులతో వైఎస్సార్ సీపీ వారిని వేధిస్తే ఊరుకోం టీడీపీ కుట్రలకు సంబంధించిన వీడియోల ప్రదర్శన కుట్రదారులను అరెస్టు చేయండి మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి డిమాండ్

జగన్ పర్యటన భగ్నానికి కుట్ర