
వేలం బహిష్కరణ.. రోడ్డెక్కి నిరసన
పొగాకు రైతులు కనెర్ర చేశారు. పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు..
కంపెనీల ప్రతినిధులు, అధికారులు,
దళారులతో కుమ్మకై ్క రైతుకు కనీసం మద్దతు ధర ఇవ్వడం లేదు. నాలుగు బేళ్లు తెస్తే..
ఒక్క బేల్ మాత్రమే తీసుకుని మిగిలినవి
నో బిడ్ పేరుతో తిరస్కరిస్తున్నారు. ఎన్నిసార్లు బోర్డుకు వచ్చినా ఇదే పరిస్థితి. పొగాకు సాగుకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం. వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం.
ఏటా ఈ సమయానికి 80 శాతం పొగాకు బేళ్లు అమ్ముడయ్యేవి. ఈ ఏడాది కనీసం
30 శాతం కూడా కొనలేదు. బయ్యర్లు అన్ని రకాల బేళ్లను కొనుగోలు చేసే విధంగా బోర్డు అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పొగాకు రైతులకు న్యాయం చేయాలి.
ఇదీ కనిగిరిలో పొగాకు రైతుల డిమాండ్
కనిగిరిరూరల్: పొగాకుకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం కనిగిరిలో వేలాన్ని బహిష్కరించిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. పొగాకు రైతులను పట్టించుకోని ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన తెలిపారు. చాకిరాల క్లస్టర్(చాకిరాల, వెలిగండ్ల, రామలింగాపురం, రామాపురం, గోకులం, జిల్లెలపాడు, కేకే పల్లి, మల్లంరాజుపల్లి, సూరావారిపల్లి) పరిధిలోని 9 గ్రామాలకు చెందిన సుమారు 150 బ్యార్నీలకు చెందిన 200 మంది రైతులు గురువారం 605 బేళ్లను వేలానికి తెచ్చారు. ప్రతి రైతు కనీసం 3 నుంచి 4 బేళ్లు తీసుకురాగా.. వాటిలో ఒకటీ రెండు మాత్రమే కొనుగోలు చేసి, మిగతా వాటిని నోబిడ్ పేరుతో తిరస్కరించారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. వేలంలో పాల్గొన్న 9 కంపెనీల ప్రతినిధులంతా కుమ్మక్కె రైతులకు అన్యాయం చేస్తున్నారని.. నో బిడ్ పేరుతో తిరస్కరించడం సరికాదంటూ రాస్తారోకో చేశారు. దీంతో కనిగిరి– పొదిలి జాతీయ రహదారిపై సుమారు గంటకుపైగా వాహనాలు స్తంభించాయి. ఎస్సై టి.శ్రీరాం తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య ఉంటే బోర్డు లోపల అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని, రోడ్డెక్కి వాహనాలు ఆపడం చట్టరీత్య నేరమని చెప్పారు. దీంతో రైతులు తమ గోడును పోలీసుల ఎదుట వెళ్లబోసుకున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలయ్యామని.. తమ కష్టాలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలోనే న్యాయం చేయాలని రోడ్డెక్కామని వివరించారు. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
ఆక్షన్ సూపరిండెంట్పై రైతుల ఆగ్రహం
రాస్తారోకో వద్దకు వచ్చిన బోర్డు సూపరింటెండెంట్ ఆంజనేయులుపై పొగాకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీల ప్రతినిధులు, బయ్యర్లు అంతా కుమ్మకై ్క బేళ్లను తిరస్కరిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. బోర్డు అధికారులు చెప్పిన ప్రకారమే పొగాకు సాగు చేశామని.. ఇప్పుడు డిమాండ్ లేదంటూ బేళ్లను తిరస్కరిస్తే తమ గతేం కావాలని ప్రశ్నించారు. ఇతర బోర్డుల కంటే కనిగిరిలోనే తక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నాయని.. అక్కడ కొనుగోళ్లు చేస్తున్న కంపెనీలు ఇక్కడ ఎందుకు తిరస్కరిస్తున్నారని నిలదీశారు. నో బిడ్ లేకుండా లోగ్రేడ్ పొగాకు బేళ్లను కూడా కొనుగొలు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అన్ని రకాల బేళ్ల కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని బోర్డు సూపరింటెండెంట్ చెప్పడంతో తిరిగి వేలం కొనసాగింది.
కనిగిరి–పొదిలి జాతీయ రహదారిపై బైఠాయించి పొగాకు రైతుల రాస్తారోకో
గిట్టు బాటు ధర కల్పించి, అన్ని రకాల పొగాకు బేళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్
హైవేపై గంటకు పైగా స్తంభించిన వాహనాల రాకపోకలు
రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేసిన పోలీసులు
తమకు అన్యాయం చేస్తున్నారంటూ బోర్డు అధికారులపై రైతుల మండిపాటు
అన్ని రకాల బేళ్ల కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్న ఆక్షన్ సూపరింటెండెంట్
రైతులు ఇబ్బంది పడుతోంది వాస్తవం
లోగ్రేడ్ పోగాకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఆందోళన చేశారు. 9 కంపెనీలు లిస్ట్లో ఉన్నా 4 కంపెనీలే పూర్తిగా వేలంలో పాల్గొంటున్నాయి. ఒక్క కంపెనీ(పొలిశెట్టి) మాత్రమే లోగ్రేడ్ కొనుగోలు చేస్తోంది. అందులో కూడా పతలా రకం మాత్రమే తీసుకుంటున్నారు. మిగతా కంపెనీలు తమకు ఆర్డర్ లేదని కొనుగోలుకు ఇష్టపడటం లేదు. అందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. రైతులు ఆరోపించినట్లు కుమ్మక్కు ఏమీలేదు.
– ఆంజనేయులు, వేలం నిర్వహణాధికారి