ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కూటమి | - | Sakshi
Sakshi News home page

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కూటమి

Jun 14 2025 10:12 AM | Updated on Jun 14 2025 10:12 AM

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కూటమి

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కూటమి

ఒంగోలు టౌన్‌: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అన్నీ విధాలుగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి స్పష్టం చేశారు. మంచి పరిపాలన అందిస్తున్నట్లు కూటమి పాలకులు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, అయితే ప్రజలు మాత్రం కూటమి పాలన పట్ల సంతృప్తిగా లేరని కుండబద్దలు కొట్టారు. స్థానిక సుందరయ్య భవనంలో శుక్రవారం కూటమి ఏడాది పాలనపై ప్రచురించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను ఇంటింటికీ అందిస్తారని ఆశించిన ప్రజలు గత ఎన్నికల్లో కూటమికి భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలలో ఆడబిడ్డ పథకం కింద 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలందరికీ నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని అమలు చేయకుండానే సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆడబిడ్డ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో మహిళల ఆర్ధిక స్వాలంబనకు సాయం అందించినట్లు కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని మహిళలు నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. దాన్ని వదిలేసిన చంద్రబాబు పీ 4 గురించి మాట్లాడుతున్నారని, ఎవరికై తే అవసరమో వారికి పీ4 అమలు చేస్తామని చెప్పడం మాట మార్చడమేనన్నారు. పీ4 పేరుతో కార్పొరేట్‌ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేయడం మహిళలను మరోసారి మోసగించడమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చారని చెప్పారు. దీంతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇస్తామని చెప్పి దాని గురించి కనీసం ప్రస్తావించడం లేదని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి సంపదను ఎలా సృష్టిస్తారని ప్రశ్నించారు. విత్తనాలు, పురుగు మందులు సబ్సిడీకి ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. పొగాకు కొనుగోలు జరగక, రైతులకు గిట్టుబాటు ధరలు లభించక ఆందోళన చెందుతున్నారని, బర్లీ పొగాకుకు సరైన ఽగిట్టుబాటు ధర రాక రైతులు అప్పుల పాలయ్యారన్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని కూటమి పాలకులు దెబ్బ తీశారని విమర్శించారు. పుస్తకావిష్కరణలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్‌ హనీఫ్‌, పూనాటి ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలం సూపర్‌ సిక్స్‌ అమలు చేయకపోవడంతో నమ్మకం కోల్పోయిన కూటమి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి సంపద ఎలా సృష్టిస్తారని ప్రశ్న మహిళలకు నెలకు రూ.1500 ఎప్పుడిస్తారంటూ నిలదీత ఏడాది కూటమి పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement