
నమో నారసింహా..
సింగరాయకొండ: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం స్వామి వారి కళ్యాణోత్సవం, సాయంత్రం రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఈ కళ్యాణోత్సవానికి మంత్రి స్వామి రాలేకపోవటంతో ప్రభుత్వం తరఫున పంపిన పట్టు వస్త్రాలను మంత్రి తరఫున స్వామి వారికి అందజేసినట్లు దేవస్థాన ఈఓ పీ కృష్ణవేణి తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులకు స్వామి వారి తలంబ్రాల బియ్యాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం గ్రామ వీధుల్లో వైభవంగా జరిగింది. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై ఉంచి ఊరేగించారు. రథోత్సవంలో ఎటువంటి అపశ్రుతులు జరగకుండా సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై బీ మహేంద్ర చర్యలు తీసుకున్నారు. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆర్యవైశ్యులు, శ్రీ కృష్ణ యాదవ్ యూత్ఫోర్స్, బ్రాహ్మణ సంఘాల వారు అన్నదానం నిర్వహించారు.
కన్నుల పండువగా కళ్యాణోత్సవం, రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తులు

నమో నారసింహా..

నమో నారసింహా..