
నేడు తిరగబడి
నాడు మెరుగుబడి..
వేసవి సెలవుల తర్వాత పాఠశాలలతో పాటు..విద్యార్థులకు సమస్యలూ
పునఃప్రారంభమయ్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని వసతులూ కల్పిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసింది. బడిగంట మోగిన వేళ..ఎంతో ఉత్సాహంగా స్కూళ్లలో అడుగుపెట్టిన విద్యార్థులకు వసతుల లేమి.. నాడు–నేడు పనులు నిలిచిపోయి అసంపూర్తిగా ఉన్న
భవనాలు.. పనిచేయని ఆర్వో ప్లాంట్లు.. అపరిశుభ్రంగా ఉన్న పాఠశాల
ఆవరణలు ఇలా పలు సమస్యలు స్వాగతం పలికాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులే ప్రాంగణాలను శుభ్రం
చేసుకోవడం కనిపించింది. విద్యార్థుల అగచాట్లపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
ఒంగోలు సిటీ:
జిల్లాలోని వివిధ యాజమాన్యాలు కింద 2,991 పాఠశాలలు ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ 1,80,394 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు 15,04,680 పుస్తకాలు, బ్యాగులు 1,39,293, పాఠ్యపుస్తకాలు 12,69,884, నిఘంటువులు 65,293, బెల్టులు 52,575, ఏకరూప దస్తులు 3,62,824 రావాల్సి ఉంది. ఈ విద్యార్థ్ధులందరికీ పాఠశాలల పునఃప్రారంభానికి నాటికి స్టూడెంట్ కిట్స్ (విద్యామిత్ర కిట్లు) స్కూల్స్ కు చేరుస్తామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.. కానీ ఆమేరకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. జిల్లాలోని చాలా పాఠశాలలకు యూనిఫాం, బ్యాగులు, షూ చేరనేలేదు. దీంతో పాఠశాల ప్రారంభమైన రోజునే కిట్లు కాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, డిక్షనరీలు మాత్రమే సరఫరా చేసి మమ అనిపించారు. పూర్తిస్థాయిలో పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం సరఫరా చేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలు, జగనన్న కిట్లు, తదితర విద్యాసామగ్రి పాఠశాలలకు చేరేవని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు.
పూర్తికానీ ఉపాధ్యాయుల
బదిలీల ప్రక్రియ..
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పూర్తి చేసి పాఠశాలల ప్రారంభం నాటికి కొత్త స్కూళ్లలో ఉపాధ్యాయులు చేరేలా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్అసిస్టెంట్లు బదిలీలు పూర్తయినా ఎస్జీటీల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు కొత్త స్కూళ్లకి వెళ్లాలి. అయితే వారి పాత స్థానంలోకి ఎవరూ రాకపోతే అలాంటి వారు వెనక్కు రావాలి. ఈ స్థానంలోకి మరొకరు వచ్చేదాకా అక్కడే కొనసాగాలి. గురువారం కూడా బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
పనిచేయని ఆర్వో ప్లాంట్లు...
విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా పాఠశాలల్లో అవి పనిచేడం మానివేశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యార్థులు నీటి కోసం అగచాట్లు పడ్డారు. ఇళ్ల నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకునే వారు. స్కూళ్లు తెరిచే నాటికై నా అవి బాగుపడతాయేమోనని విద్యార్థులు ఆశపడ్డారు. అయితే జిల్లాలోని పలు స్కూళ్లలో మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్లు దర్శనమివ్వడంతో నిరాశకు గురయ్యారు. పాఠశాలల ఆవరణలో నిర్మాణ సామగ్రి నిల్వతో విద్యార్థులు అవస్థలు పడ్డారు.
మధ్యాహ్న భోజనం ఇలా..
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 2327 స్కూళ్లకుగాను 1,35,444 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. అందులో తొలి రోజు 89087 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 87,601 మంది విద్యార్థులను భోజనం పెట్టారు.
అవస్థల నడుమ పాఠశాలలు పునః ప్రారంభం విద్యార్థులకు స్వాగతం పలికిన సమస్యలు నాడు–నేడు ఫేజ్2లో నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు జిల్లా వ్యాప్తంగా పనిచేయని ఆర్వో ప్లాంట్లు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందని యూనిఫాం, బ్యాగులు అధ్వానంగా మరుగుదొడ్లు తొలిరోజు స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు అవస్థలు
చీకట్లో చదువులు
కనిగిరిలో విద్యార్థిమిత్ర పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదు. కొన్ని పాఠశాలలకు యూనిఫాం చేరలేదు. నియోజకవర్గంలోని ఏ పాఠశాలలకు కూడా స్కూల్ బ్యాగ్లు ఇవ్వలేదు. దీంతో విద్యార్థులకు ఇచ్చిన కొత్త పుస్తకాలను తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. గతంలో ఏర్పాటు చేసిన వాటర్ ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేయకపోవడంతో అవి మూలనపడ్డాయి. దీంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. బదిలీల ప్రక్రియ నేపథ్యంలో ఉపాధ్యాయులూ పూర్తిస్థాయిలో పాఠశాలల్లో కన్పించలేదు. నాడు–నేడు పనుల్లో పురోగతి లేకపోవడంతో మొండి గోడలు, పూర్తి కాని భవనాలు దర్శనమిచ్చాయి. పామూరు మండలంలోని 3 పాఠశాలలు ప్రాథమికోన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి అప్గ్రేడ్కాగా ఆయా పాఠశాలలో తగినన్ని గదులు, ఇతర వసతులు లేవు. దీంతో విద్యార్థులు ఫ్లోరింగ్ కాని గదిలోనే కూర్చోవాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారు.

నేడు తిరగబడి