ఇండెంట్‌ ఇలా.. చదువు సాగేదెలా? | - | Sakshi
Sakshi News home page

ఇండెంట్‌ ఇలా.. చదువు సాగేదెలా?

Jun 12 2025 2:50 AM | Updated on Jun 12 2025 2:50 AM

ఇండెంట్‌ ఇలా.. చదువు సాగేదెలా?

ఇండెంట్‌ ఇలా.. చదువు సాగేదెలా?

ఒంగోలు సిటీ:

మాజంలో పేదరికాన్ని రూపుమాపాలంటే విద్యతోనే సాధ్యమని జ్యోతిబా పూలే, బీఆర్‌ అంబేడ్కర్‌ లాంటి మహామహులు మొదలు ఎందరో విద్యావేత్తలు పేర్కొన్నారు. విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందిస్తే ఆర్థిక అసమానతలు తొలగించేందుకు అవకాశముంటుందన్నది జగమెరిగిన సత్యం. ఇందుకు ప్రభుత్వాల తోడ్పాటు తప్పనిసరి. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సర్కారు విద్యావ్యవస్థను క్రమంగా చిదిమేసే చర్యలకు పూనుకుంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కల్పించిన వసతులను, అందించిన పథకాలను దూరం చేసి పరోక్షంగా ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపే ఎత్తుగడలు వేస్తోంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సమయానికి విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, డిక్షనరీలు, యూనిఫాంల, బెల్టులు, బ్యాగులు, షూస్‌ తదితర సామగ్రిని ఇప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదు. జిల్లాలోని 38 మండలాల్లో విద్యా వనరుల కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి పాఠ్య పుస్తకాలు సరఫరా చేయడం ప్రారంభించింది. తొలివిడతలతో కొంత సామగ్రిని పంపగా, మిగిలినవి రెండో విడతలో వస్తాయని ఎంఈఓలు చెప్పుకొచ్చారు. కానీ నేటికీ పుస్తకాలతో సహా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యా కిట్‌లోని సామగ్రి పాఠశాలలకు చేరలేదు.

తల్లికి వందనంపై స్పష్టత ఏది?

జిల్లా వ్యాప్తంగా 3,098 పాఠశాలల్లో 2,28,973 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఊదరగొట్టిన కూటమి నాయకులు తొలి ఏడాది మొండిచేయి చూపారు. దీంతో జిల్లాలోని విద్యార్థులు దాదాపు 340 కోట్ల రూపాయల మేర లబ్ధి కోల్పోయారు. ఈ ఏడాది జిల్లాలోని విద్యార్థుల సంఖ్య ప్రకారం తల్లుల ఖాతాల్లో 343.46 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది. పాఠశాలల పునఃప్రారంభం రోజున తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉంటుందో.. ఎగిరిపోతుందో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. లబ్ధిదారుల జాబితాను ముందుగా ప్రకటించకపోవడం, అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం లాంటివి ఏవీ లేకుండానే పథకం నేరుగా అమలు చేస్తామని చెప్పడంపై తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

టీచర్ల బదిలీల్లో గందరగోళం

ప్రభుత్వ పాఠశాలకు 49 రోజులపాటు వేసవి సెలవులు వచ్చాయి. ఈలోపే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి చేసి పాఠశాలలు తెరిచే సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడంలో హోరంగా విఫలమైంది. ఎస్జీటీల బదిలీలను మాన్యువల్‌ పద్ధతిలో చేపడతామని చెప్పిన సర్కారు.. అంతలోనే మాట మార్చి వెబ్‌ కౌన్సెలింగ్‌కు పిలిచింది. దీంతో ఉపాధ్యాయులు ఎక్కడికక్కడ రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పాఠశాలలు ప్రారంభిస్తున్న సమయంలోనే ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉండటంతో మరో పది రోజుల వరకు తరగతుల నిర్వహణ గందరగోళంగా మారే అవకాశం ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా బదిలీల కౌన్సెలింగ్‌ విషయంలో ఉపాధ్యాయ సంఘాల మధ్య విభేదాలు భగ్గుమనడం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై సర్కారు అలసత్వం చూపుతుండటంతో పిల్లలను పంపాలా వద్దా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.

నాడు నేడుకు మంగళం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జిల్లాలో మన బడి నాడు–నేడు కింద తొలివిడత 1015 పాఠశాలలను ఎంపిక చేసి రూ.229.61 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 7,431 పనులు పూర్తి చేశారు. తరగతి గదుల నిర్మాణం, ఆధునికీకరణ, ఫర్నిచర్‌, గ్రీన్‌ చాక్‌బోర్డులు, ల్యాబ్‌లు, వాటర్‌ప్లాంట్లు, ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులు, విద్యుదీకరణ ఇలా అన్ని రకాల వసతులు కల్పించి కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా చేశారు. నాడు–నేడు రెండో దశలో 979 పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసి రూ.417.31 కోట్ల నిధులు కేటాయించారు. మరుగుదొడ్లు, విద్యుదీకరణ, వంట గదుల నిర్మాణం, తరగతి గదుల మరమ్మతులు పూర్తి చేశారు. అయితే జిల్లాలోని 80 పాఠశాలల్లో 71 భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏడాది కాలంగా ఈ పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

దప్పిక తీరే దారేది?

జిల్లాలో అధిక శాతం పాఠశాలల్లో వాటర్‌ ప్లాంట్లు మొరాయించాయి. గత విద్యా సంవత్సరంలోనే మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్లను బాగు చేయించకుండా వదిలేశారు. వేసవి సెలవుల్లో మరమ్మతులు పూర్తి చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది తొలి నుంచే తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

నోట్‌ పుస్తకాలు వచ్చింది 9,87,558

6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇవ్వాల్సింది 15,04,680

జిల్లాలో ప్రభుత్వ

పాఠశాలలు 3,098

మొత్తం విద్యార్థుల సంఖ్య 2,28,973

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కిట్‌కు

ఇండెంట్‌ పెట్టింది

1,81,412 మందికే..

పాఠ్యపుస్తకాలు వచ్చింది 8,65,226 రావాల్సింది 12,69,884

బ్యాగులు వచ్చింది 42,119 ఇంకా రావాల్సింది 1,39,293

ఏకరూప దుస్తులు

వచ్చింది 1,18,130

రావాల్సింది 362824

నిఘంటువులు వచ్చింది 1,16,595

ఇంకా రావాల్సింది 65,293

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

సర్కారు నిర్వాకంతో ఇప్పటికీ పూర్తి కాని టీచర్ల బదిలీల ప్రక్రియ

పాఠశాలకు పూర్తి స్థాయిలో అందని స్టూడెంట్‌ కిట్లు

నాడు–నేడు మిగులు పనులు ఏడాదిగా నిలిపివేత

కళావిహీనంగా ప్రభుత్వ పాఠశాలలు

మౌలిక వసతులపై దృష్టి సారించని వైనం

తల్లికి వందనం పథకంపై స్పష్టత కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement