
గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం
పెద్దారవీడు: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. బుధవారం మండలంలోని దేవరాజుగట్టులో రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక అప్పుల్లో కూరుకుపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం గ్రామాల్లో రైతులు ఆర్థికంగా అధోగతి పాలవుతున్నారని, దిక్కుతోచని పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నేటికీ రైతులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నేరవేర్చలేదన్నారు. కూటమి పాలనలో నిరుద్యోగులు, యువకులు, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలపై దురాగతాలు తారస్థాయికి చేరుకున్నాయని, దాడులు జరుగుతున్నా కూటమి పాలకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పత్రిక స్వచ్ఛను హరిస్తూ సాక్షి మీడియా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం పొదిలిలో నిర్వహించే జగనన్న పోరుబాట కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే తాటిపర్తి బయల్దేరారు.
పార్టీ మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ ఏర్వ చలమారెడ్డి, సర్పంచ్లు అంగిరేకుల ఆదినారాయణ, మూల రమణారెడ్డి, గుడ్డెపోడు రమేష్, నాయకులు గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బట్టగిరి రమణారెడ్డి, వెన్నా శివకృష్ణారెడ్డి, దుద్దెల వెంకటరెడ్డి, జైనూల్లావూద్దీన్, ఏలూరి వెంకటనారాయణరెడ్డి, తోకల ఆవులయ్య, గుంటూ దానమయ్య, గాదం శ్రీనివాసులు, ఏర్వ శేషసేనారెడ్డి, నాగరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.