కార్పొరేట్లకు కూటమి దాసోహం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్లకు కూటమి దాసోహం

Jun 11 2025 7:49 AM | Updated on Jun 11 2025 9:18 AM

కార్పొరేట్లకు కూటమి దాసోహం

కార్పొరేట్లకు కూటమి దాసోహం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ఒంగోలు టౌన్‌:రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుకూలంగా పని చేస్తోందని, కార్పొరేట్లను అదుపులో ఉంచలేని సమర్థ ప్రభుత్వం పీ 4 గురించి మాట్లాడడం హాస్యస్పదం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 10 శాతం ఉన్న కార్పొరేట్‌ కంపెనీలో 20 శాతం ప్రజల అభివృద్ధికి పాటుపడతాయని చెప్పడం పెద్ద జోక్‌ అని అభివర్ణించారు.

 ఉగాది నాడు మేఘ కంపెనీ బంగారు కుటుంబం పేరుతో నాలుగు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిందని, ఆ కంపెనీకి దాతృత్వం ఉంటే పోలవరం ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులకు కనీసం వెయ్యి రుపాయల వేతనం పెంచి ఉండేదన్నారు. గత ఏడాది లాభాలు పొందిన ఐటీసీసి, జీపీఐ కంపెనీలు పొగాకు కొనుగోలు చేయవచ్చుకదా అని ప్రశ్నించారు. గత ఏడాది మంచి లాభాలు పొందిన ఈ కంపెనీలు రైతుల శ్రమను ఊడ్చేయాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో పొగాకు రైతుల ఆదాయం 40 శాతం పడిపోతే ఐటీసీ షేర్‌ విలువ 4 శాతం పెరగడం వెనుక ప్రోత్సాహం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్పొరేట్ల ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని జీడీపీని లెక్కించడం సరైన పద్ధతి కాదన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి యోగాంధ్ర పేరుతో మోడీ మెప్పు పొందే పనిలో పడిందని వ్యాఖ్యానించారు. శ్రమజీవులకు యోగాతో అవసరం లేదని, శ్రమకు తగిన ఫలితం పొందినప్పుడే మానసిక ప్రశాంతత పొందుతారని చెప్పారు. యోగాకు తాము వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. గ్రామ గ్రామానికి ఒక యోగా కేంద్రం పెట్టి అక్కడ శిక్షకులను నియమిస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కొంతైనా తీరుతుందన్నారు. ముఖ్యమంత్రికి చేతనైతే విశాఖకు వస్తున్న ప్రధాన మంత్రి చేత విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 100 మంది ఇంటర్‌, బీటెక్‌లు చదువుకుంటే కేవలం 5 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని, మిగిలిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 రాష్ట్రంలో రోజుకో అఘాయిత్యం జరుగుతుందని, డ్రగ్స్‌ మాఫియా, మద్యపానం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. అమాయకులను పోలీసులు శిక్షిస్తున్నారని, దీనికి తెనాలి ఘటన నిదర్శనమన్నారు. వేలకోట్లు ఎగవేసిన మాయగాళ్లకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారని ధ్వజమెత్తారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కె మాబు మాట్లాడుతూ... జిల్లాలో లక్ష కుటుంబాలు పొగాకు మీద ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మార్కెఫెడ్‌, ఎన్‌టీసీని రంగంలోకి దింపి పొగాకు కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కంకణాల ఆంజనేయులు, పూనాటి ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement