
ఉద్యోగం పేరుతో రూ.5.50 లక్షలకు టోకరా
ఒంగోలు టౌన్: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పేర్నమిట్ట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 5.50 లక్షల రుపాయలు తీసుకుని మోసం చేసినట్లు పొదిలికి చెందిన ఒక యువకుడు ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసిన బాధితుడు తనకు జరిగిన మోసాన్ని వివరించాడు. డబ్బు వసూలు చేసిన సదరు మోసగాడు తమ మెయిల్కు ఫేక్ ఆఫర్ లెటర్ పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మర్రిపూడికి చెందిన ఒక మహిళ తన ఇంటిని తాకట్టు పెట్టి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ దగ్గర 4 లక్షల రుపాయలు రుణం తీసుకొంది. ప్రతి నెలా 11,500 రుపాయల ఈఎంఐ చెల్లిస్తోంది. అయితే కంపెనీ తరఫున డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తి మధ్యలో ఉద్యోగం మానేశాడు. ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రతి నెలా ఈఎంఐ వసూలు చేసుకొని వెళ్తున్నాడు. తన వద్ద వసూలు చేసిన డబ్బును కంపెనీకి చెల్లించకుండా మోసం చేసినట్లు తెలుసుకున్న సదరు మహిళ ఎస్పీ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది.
ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి గుంటూరుకు చెందిన వ్యక్తి దగ్గర 19 వేల రుపాయలకు ఆపిల్ వాచ్ కొనుగోలు చేశారు. వాచ్ కొన్న తరువాత రిపేర్లో ఉన్నట్లు తెలిసింది. దానికి సంబందించిన డాక్యుమెంట్లు అడుగుతుంటే ఇవ్వడం లేదని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా మొత్తం 71 ఫిర్యాదులు పోలీస్ గ్రీవెన్స్కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పేవారిని నమ్మి మోసపోవద్దని యువతకు సూచించారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని చెప్పారు. బాధితుల ఫిర్యాదులను చట్టపరంగా పరిశీలించి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ రమణ కుమార్, సీసీఎస్ సీఐ జగదీష్, ఎస్సీ ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, టీడీసీ సీఐ షమీముల్లా, ప్రజా సమస్యల వేదిక ఎస్సై జనార్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేసిన బాధితులు
పోలీస్ గ్రీవెన్స్కు 71 ఫిర్యాదులు

ఉద్యోగం పేరుతో రూ.5.50 లక్షలకు టోకరా