
లారీలపై పన్ను బాదుడే బాదుడు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పన్నులు పెంచడం వల్ల లారీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ పేర్కొన్నా. జీవో నంబర్ 21 తీసుకొచ్చి రవాణా కార్మికుల మీద చలానాలు, శిక్షలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఇది కార్మికులకు తలకుమించిన భారంగా మారిందన్నారు. ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముజఫర్ మాట్లాడుతూ.. రవాణా రంగంలో అనేక చట్టాలు తీసుకొచ్చి కార్మికుల పొట్టలు కొడుతున్నారని మండిపడ్డారు. బీఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా రవాణా కార్మికుల మీద కేసులు బనాయించే సంస్కృతి పెరిగిపోయిందన్నారు. ఆలిండియా ట్రాన్ప్పోర్ట్ ఫెడరేషన్ పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కొంత డైలామాలో పడినప్పటికీ దొడ్డిదారిన చట్టాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేరళలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి వర్కర్ నుంచి మినిమం ఫండ్ వసూలు చేసి పథకాలు అమలు చేస్తున్నారని, ఇదే పద్ధతిని దేశం మొత్తం అమలు చేయాలని కోరారు. జూలై 15, 16వ తేదీల్లో ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తంబి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సమావేశంలో మహమ్మద్ హుసేన్, కాశీ విశ్వనాథం, సయ్యద్ మున్నా భాషా, పిచ్చిరెడ్డి, బ్రహ్మయ్య, అల్లాడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మూడు నెలలకోసారి పన్ను పెంచుతున్న కూటమి ప్రభుత్వం
కార్మికుల పొట్టలు కొట్టేలా రవాణా చట్టాలు
రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ధ్వజం