
పొగాకు..మిర్చి..శనగ..ధాన్యం..కంది..పత్తి..పసుపు.. జిల్లాలో ఏ రైతును కదిలించినా కన్నీటి వ్యథలే.. కనీస గిట్టుబాటు ధరలు రాక అన్నదాతల పరిస్థితి చావో...రేవో అన్నట్లుగా తయారైంది. కాయకష్టం చేసి ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిల్లాడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర రాలేదంటే అన్నదాత దీనావస్థ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. మిర్చి రైతు లబోదిబోమన్నాడు. వరి, శనగ, పత్తి, మినుము ఇలా ఏ పంట చూసుకున్నా గిట్టుబాటు ధర రాక అందినకాడికి తెగనమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ రాలేదని రైతన్నలు వాపోతున్నారు.
అప్పులు తీర్చలేమన్న బెంగతో..
మార్కాపురానికి చెందిన రాజారపు పెద్ద యలమందయ్య అనే రైతు 7 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. ఏటా మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. రైతు భరోసా అందకపోవడంతో పంటల సాగు కోసం వడ్డీలకు అప్పులు తీసుకున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటూ మరో వైపు పండించిన పంటలకు ఆశించిన ధర లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తెచ్చిన అప్పులు పెరిగి రూ.25 లక్షల వరకు అయ్యాయి. నెల క్రితం అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశాడు. ఈ ఏడాది పంట దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఈనెల 7వ తేదీ ఉదయం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో 2024–25 రబీ సీజన్లో సాధారణంగా 3,97,880 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయాల్సి ఉంది. అయితే కేవలం 2,99,331 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో కూడా దాదాపు లక్షకు పైగా ఎకరాల్లో నిలువునా ఎండిపోయాయి. మిగతా 1.99 లక్షల ఎకరాల్లో కూడా సగానికిపైగా ఎకరాల్లో దిగుబడి మరీ దారుణంగా పడిపోయింది. దాదాపు జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాల్సి ఉండగా, చివరకు దిగుబడి అంతంతమాత్రంగా వచ్చింది. కేవలం లక్ష ఎకరాల్లోపే అన్నది స్పష్టమవుతోంది.
పొగాకు రైతును ముంచేసిన పాలకులు..
జిల్లాలో పొగాకు రైతు పరిస్థితి ముందుగొయ్యి..వెనుక నుయ్యి అన్న చందంగా తయారైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఊహించని లాభాలు గడించిన రైతులు నేడు కనీస పెట్టుబడి రాక అప్పుల పాలవుతున్నారు. రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల పరిధిలో 30 వేల మందికి పైగా రైతులు పొగాకు సాగుచేస్తున్నారు. 39 వేల బ్యారన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 105.2 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే 159.45 మిలియన్ కిలోల వరకూ ఉత్పత్తి వస్తుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై సరిగ్గా 90 రోజులు కావస్తున్నా మద్దతు రాకపోవడంతో చివరకు ఎదురు చూపులే మిగిలాయి.
నాణ్యమైన పొగాకుకు కూడా కిలోకు సరాసరి రూ.240కి మించడం లేదు. నాణ్యత పేరుతో ధరలను భారీగా తగ్గించేస్తున్నారు. చాలా కేంద్రాల్లో కిలో రూ.160 నమోదవుతుండడం గమనార్హం. మొత్తం 32 కంపెనీలు పొగాకు కొనుగోళ్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. కానీ కేవలం 15 నుంచి 18 కంపెనీలు మాత్రమే వేలంలో పాల్గొంటున్నాయి. దీంతో కంపెనీలు రైతు బతుకులతో ఎలా ఆడుకుంటున్నాయో అర్థమవుతోంది. గత ఏడాదితో పోల్చుకుంటే పొగాకు సాగు ఖర్చులు 20 నుంచి 25 శాతం వరకూ పెరిగాయి.
అన్నీ కలిపి ఎకరాకు సుమారు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టారు. తీరా ధరలు నేల చూపులు చూస్తుండడంతో రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నాడు. ఒకవైపు వ్యాపారుల మాయాజాలం, మరోవైపు పొగాకు బోర్డు, టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆందోళన బాటపడుతున్నారు. రోజుకో ప్రాంతంలో ధర్నాలు చేస్తూ పోతున్నారు. అయినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదు. బోర్డు అధికారులు సైతం తూతూ మంత్రంగా వ్యవహరిస్తుండటంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.
మిర్చి రైతు కంట్లో కారం..
జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రైతులు అత్యధికంగా మిర్చి సాగు చేస్తారు. వైఎస్సార్ సీపీ హయాంలో 96 వేల ఎకరాల్లో సాగు చేసిన రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గించేశారు. ఈ సారి సుమారు 59,005 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. గత ఏడాది నవంబర్లో క్వింటా ధర రూ.17 వేల నుంచి రూ.18 వేలు ఉండగా, డిసెంబరు నాటికి రూ.14 వేలకు పడిపోయింది. జనవరిలో రూ.14 వేల నుంచి రూ.12 వేలకు చేరి మార్చిలో రూ.10 వేలు కనిష్టానికి పడిపోయింది. ఇక మిర్చి కోతలకు కూలీలకు భారీగా చెల్లించాల్సి వస్తోంది. క్వింటా మిర్చి కోసేందుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకూ ఖర్చు చెల్లిస్తున్నామని రైతులు తెలిపారు. దీంతో మిర్చి రైతు ఆర్థికంగా చితికిపోయాడు.
‘కంది’పోయిన ధరలు..
జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలోని మెట్ట భూముల్లో రైతులు ఏటా కంది పైరు సాగు చేస్తూ వస్తున్నారు. 66,500 ఎకరాలకు పైగా కంది సాగు చేశారు. మార్కెట్లో కందులకు డిమాండ్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు. క్వింటా కందులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.7,550 ప్రకటించింది. దీంతో కందుల ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర తక్కువగా ఉండటంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళనలకు గురయ్యారు.
పంటలు ఎండి..ప్రాణాలు వదిలి
అర్థవీడు మండలం కాకర్లకు చెందిన చిన్న దిబ్బారెడ్డి (42) నాలుగేళ్లుగా తనకున్న 8 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశాాడు. ఏ పంటలోనూ సరైన దిగుబడి రాలేదు. దీంతో దాదాపు రూ.15 లక్షల మేర అప్పులయ్యాయి. గత ఏడాది బోర్ల కింద 2 ఎకరాల్లో పొగాకు నారుమండి, 5 ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. తీవ్ర వర్షాభావంతో పంటలు పూర్తిగా ఎండిపోయి కుంగిపోయాడు. 2024 అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం పొలానికి వెళ్లి పురుగులమందు తాగాడు. ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో వెతుక్కుంటూ పొలానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు అపస్మారక స్థితిలో ఉన్న దిబ్బారెడ్డిని చూసి అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
రైతు ఆత్మహత్యతో ఊరొదిలిన కుటుంబం
అర్థవీడు మండలంలోని చిములేటిపల్లెకు చెందిన రైతు నడిపి వెంకటేశ్వర్లు (43) తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని గత ఏడాది పత్తి, మొక్కజొన్న, మిరప పంటలు సాగుచేశాడు. 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న వెంకటేశ్వర్లు పంటల సాగు కోసం బ్యాంకు రుణం రూ.లక్ష, బయట అధిక వడ్డీలకు రూ.7లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగా పండకపోవడంతో పాటు అప్పులు తీర్చే మార్గం తెలియక 2024 అక్టోబర్ 31న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. భర్త మరణంతో భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులను తీసుకుని ఊరు వదిలి తన పుట్టింటికి వెళ్లింది.
పొగాకు ధరలు పతనమై..ఆశలు ఆవిరై..
కొండపి మండలం నెన్నూరుపాడుకు చెందిన చల్ల మధుసూదన్రెడ్డి తన తండ్రితో కలిసి 10 ఎకరాల్లో పొగాకు సాగు చేశాడు. మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు పండించారు. గత ఏడాది పొగాకుకు మంచి ధర లభించడంతో ఈ ఏడాది రూ.20 లక్షల వరకు అప్పులు చేసి పొగాకు సాగు చేశాడు. వేలం ప్రారంభమైన దగ్గర నుంచి గిట్టుబాటు ధర లేదని చాలా సార్లు బాధపడ్డాడు. నాణ్యమైన పొగాకుకు కూడా చాలా తక్కువ ధర కేటాయిస్తున్నారని కూలీల ఖర్చులకి కూడా వచ్చే అవకాశం లేదని తీవ్ర మనోవేదన చెందాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో గిట్టుబాటు ధర లేక ఈనెల 6వ తేదీన కొండపిలోని పొగాకు బోర్డు వెనక ఉన్న పాకలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుమారుడు వంశీకృష్ణారెడ్డి బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. మరో కుమారుడు ఇంటర్మీడియెట్ చదివి నీట్ పరీక్షలు రాశాడు. పొలం అమ్మినా అప్పులు తీరేలా లేవని తమ్ముడి చదువు ఎలాగన్న ఆందోళన నెలకొందని కుమారుడు వంశీకృష్ణారెడ్డి వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.
దిగుబడులు రాక..అప్పులు తీరక
పెద్దారవీడు పంచాయతీలో సిద్ధిరాయునిపల్లి గ్రామానికి చెందిన రుద్రపాటి చిన్న వెంకట చెన్నయ్య (70) గత ఏడాది రెండు ఎకరాల్లో మిర్చి, ఎకరన్నరలో టమోటా, రెండున్నర ఎకరాల్లో పొగాకు పంటలు సాగుచేశాడు. పొలంలో మూడు బోర్లు వేశాడు. బోరు నుంచి నీరు అరకొరగా రావడంతో సాగునీటికి అవస్థలు పడ్డాడు. సాగుచేసిన పంటకు చీడపీడలు, తెగుళ్లు రావడం.. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. దాదాపు రూ.9 లక్షలు అప్పు ఉంది. అందులో పెద్దారవీడు ఎస్బీఐలో రూ.1.30 లక్షలు, దేవరాజుగట్టు కెనరా బ్యాంకులో రూ.1 లక్ష, మిగిలినవి ఇతరుల దగ్గర అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం తెలియక 2024 అక్టోబర్ 8వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.