
రైతులంతా పొదిలి తరలిరావాలి
నాగులుప్పలపాడు: పొగాకు రైతుల నడ్డివిరిచిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి రైతుల పక్షాన పోరాటం చేసేందుకు ఈ నెల 11వ తేదీ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి రానున్నారని, పార్టీలకు అతీతంగా రైతులంతా పొదిలి చేరుకుని జగన్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. పొగాకు రైతుల కోసం పొదిలిలోని పొగాకు బోర్డుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన, అక్కడ చేపట్టనున్న ధర్నా కార్యక్రమాలపై సోమవారం నాగులుప్పలపాడు మండలంలోని ముప్పాళ్ల మద్దిరాల గ్రామాల రైతులతో మేరుగు నాగార్జున ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులతో మేరుగు నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను పొగాకు బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం రేట్లు లేకుండానే వ్యాపారులకు దోచిపెడుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంట సాగు ఖర్చులు, కూలీల రేట్లు, తదితరాలన్నీ పెరిగిపోయాయని, కానీ, క్వింటా రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో కొనుగోలు చేస్తే రైతాంగం అప్పులెలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలకు పొగాకు బోర్డు కొనుగోలు చేయని సమయంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి క్వింటా రూ.30 వేల వరకు కొనుగోలు చేసిన విషయాన్ని మేరుగు నాగార్జున గుర్తుచేశారు. ప్రస్తుతం పొగాకు రైతుల బాధలు చూసి చలించిన జగనన్న వారికి అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు పొదిలి వస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఓటేసి మోసపోయిన పొగాకు రైతులు, ఇతర రైతులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు నలమలపు కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, కోటిరెడ్డి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు పాదర్తి శివ, రైతు విభాగం మండలాధ్యక్షుడు తగిరిశ సుబ్బారావు, మండల ఉపాధ్యక్షుడు కాటూరి ఆదియ్య, కందుల డానియేలు, జెట్టి చెన్నకేశవులు, ఘట్టమనేని అశోక్, పొద పవన్, మారెళ్ల శ్రీనివాసరావు, వెంకట్రావు, రైతులు పాల్గొన్నారు.
రేపు వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలి
పొగాకు రైతులకు మద్దతుగా నిలవాలి
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున