సాక్షి, అనంతపురం: మంత్రి పయ్యావుల కేశవ్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి, సోదరుడి దారుణహత్య వెనుక మంత్రి పయ్యావుల కేశవ్ హస్తం ఉందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్ ముందుగా తన కుటుంబ చరిత్ర ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు.
మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ఉరవకొండ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసింది మంత్రి పయ్యావుల కేశవ్. దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబానిదే. పయ్యావుల కేశవ్ తాత, తండ్రి దుర్మార్గాలపై కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. పయ్యావుల ఆగడాలపై ఆందోళన చేపట్టిన నా తండ్రి రాకెట్ల నారాయణ రెడ్డి, సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డిలను దారుణంగా హత్య చేశారు.
వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్కు తన కుటుంబ చరిత్ర తెలుసా?. వైఎస్ జగన్ను విమర్శించే అర్హత మంత్రి పయ్యావుల కేశవ్కు లేదు. ఫ్యాక్షనిజానికి వైఎస్ జగన్ వ్యతిరేకం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పారదర్శకంగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి’ అని ఘాటు విమర్శలు చేశారు.


