బాబూ.. ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా?: రాచమల్లు | YSRCP Rachamallu Siva Prasad Reddy Serious On CBN Govt Over Liquor Brands And Prices, More Details Inside | Sakshi
Sakshi News home page

బాబూ.. ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా?: రాచమల్లు

Nov 21 2024 11:41 AM | Updated on Nov 21 2024 12:35 PM

YSRCP Rachamallu Siva Prasad Reddy Serious On CBN Govt

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్‌లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్సే ప్రస్తుతం ఏపీ వైన్‌ షాపుల్లో ఉన్నాయి.

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారు. ఎన్నికలు అయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్‌లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. గతంలో ఉన్న బ్రాండ్స్‌  ప్రస్తుతం ఏపీ వైన్‌ షాపుల్లో ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయి. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.

వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో అధిక ధరలన్నాడు.. నాణ్యత లేదన్నాడు. ఆడ పిల్లల మంగళ సూత్రాలు తెంపుతాడు.. మీ ఆరోగ్యం గోవింద అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు. 99 రూపాయలకే మద్యం అన్నాడు.. కానీ ఆ చీఫ్ లిక్కర్ మాత్రం దొరకడం లేదు. మీరిచ్చిన మాట ప్రకారం ధరలు ఎక్కడ తగ్గించారు?. జగన్ ప్రభుత్వంలో అది విషం.. ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా?. ఇప్పుడు ఆడ బిడ్డల మెడలో తాళిబొట్టు తెగవా?. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం తాగే సోదరులే. వారితో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని కూడా బాబు మోసం చేశాడు.

చంద్రబాబు ఇచ్చే చీఫ్ లిక్కర్ 99కి అమ్మితే.. అదే మందు కేరళలో 85కి ఇస్తున్నారు. దానికి తోడు ఈ చీఫ్ లిక్కర్ నాణ్యమైనది కాదనేది నా అభిప్రాయం. కొన్ని ఏళ్లు ఈ మద్యం తాగితే వారి ఆరోగ్యం తప్పకుండా చెడిపోతుంది. చివరికి మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు. వారికి 20 శాతం మార్జిన్ అని చెప్పి ఇప్పుడు 9.5శాతం మార్జిన్ ఇస్తున్నాడు. విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయి.. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. మా ప్రభుత్వంలో 47వేల బెల్టు షాపులు రద్దు చేస్తే మళ్ళీ వాటిని తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యం షాపులు సంఖ్య తగ్గించి పర్మిట్ రూమ్స్ లేకుండా చేశాం. కానీ, మళ్ళీ చంద్రబాబు పాత రోజులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement