
తాడేపల్లి : ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మాయ చేసి గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. చంద్రబాబు ప్రజలకు నిలువునా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కడప మహానాడుకి జనం నామమాత్రంగా కూడా రాలేదు. వైఎస్సార్సీపీ ఒక్క వెన్నుపోటు దినం అని పిలుపునిస్తే లక్షలమంది ప్రజలు వచ్చారు. మీరు ఏ అభివృద్ధి చేయలేక జగన్ని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మరింత దిగజారి మాట్లాడుతున్నారు.
అలా మాట్లాడటానికి మంత్రికి సిగ్గులేదా?. దళితులకు ఈ రాష్ట్రంలో అవమానం జరుగుతోంది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ వలనే గంజాయి బజారులో కూడా దొరుకుతోంది. హోంమంత్రి అనితకు కులం కోటాలనే హోంమంత్రి పదవి వచ్చింది. దళితులను కొడితే హోంమంత్రి కేర్లేస్గా మాట్లాడుతున్నారు. టీడీపీలో చాలామందిపై కేసులు ఉన్నాయి. వారిని ఇలానే బజారులో కొడతారా?. పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలికపై నెలల తడబడి అత్యాచారం చేశారు.
ఈ ఘటన మీకు కనబడుటం లేదా, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?, ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాదా?, విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది టీడీపీ కాదా?, రైతులను మోసం చేసింది నిజం కాదా?, చివరకు రాష్ట్రంలో సినిమా హాళ్లను కూడా మూసివేసే పరిస్థితికి తెచ్చారు. మీ నాయకుడు పవన్ కళ్యానే సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి మాత్రమే రాజకీయ ఉద్యోగం ఇప్పించారు. పంచాయతీ రాజ్ శాఖని నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేశారు’ అని మండిపడ్డారు.