సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు అందరికీ తెలుసని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేతలు కురుసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనే దిక్కులేదు అని ఘాటు విమర్శలు చేశారు.
కాకినాడలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో కమిటీల నియామకం, పార్టీ బలోపేతంపై నియోజకవర్గ కోఆర్డినేటర్లతో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీతా, దవులూరి దొరబాబు, గిరిబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ..‘రాష్ట్ర పాలన వదిలేసి చంద్రబాబు అమరావతి కాంట్రాక్టర్లే ధ్యేయంగా ఈవెంట్లు చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనండి అని మహిళలను అవమానపరుస్తున్నారు. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా మాట్లాడుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. చేపల పులుసు ఎలా వండాలో మత్స్యకారులకే చంద్రబాబు నేర్పించిన ఈవెంట్ చూశాం’ అని ఎద్దేవా చేశారు.
కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘మత్స్యకారులకు సేవా? మత్యకారులకు శాపమా?. నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హర్బర్ కథ ఏం చేశారో మొన్ననే చూశాం. చంద్రబాబు మళ్ళీ అక్కడికే వెళ్ళి చేపల పులుసు వండుతారు. తెలుగు వెన్నుపోటు పార్టీ.. మత్య్సకారుల నుండి రైతుల వరకు వెన్నుపోటు పొడిచారు. తండ్రి ఒక్క పక్క.. కొడుకు ఒక పక్కన పొదుపు మీరు చేయండి. దుబారా మేము చేస్తామని డ్రామాలు చేస్తున్నారు. ఒకాయన సైకిల్ తొక్కుతాడు.. ఐదారు కెమెరాలు వాహనాలపై నడుస్తాయి. చంద్రబాబు డ్రామాలు ఏంటో అందరికీ తెలుసు’ అని మండిపడ్డారు



