న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చింది. రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని గంటలకే రాఘవ్ చద్దాకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటరిగీ భద్రత మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యే వరకు తక్షణమే రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం రాఘవ్ చద్దా భద్రతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు, రాఘవ్ చద్దా మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య చోటుచేసుకుంది. రాఘవ్ చద్దా భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏప్రిల్ 2న ఆయనను రాజ్యసభ డిప్యూటీ లీడర్ స్థానం నుంచి తొలగించింది. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శాపూర్వకంగా మాట్లాడలేదని ఆరోపించింది.
బీజేపీతో టచ్లో రాఘవ్ చద్దా: ఆప్
రాఘవ్ చద్దా బీజేపీతో సంప్రదింపులు జరిపారని, ఆయనకు భద్రత ఇవ్వడం ఒక ఒప్పందంలో భాగమని ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. “మా వద్ద ఈ సమాచారం ఉంది, బీజేపీ అగ్రనేతలతో రాఘవ్ సమావేశమై, అతనికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని, రాజ్యసభ ఉపనేతగా అతని స్థానంలో వచ్చిన అశోక్ మిట్టల్పై దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. రాఘవ్ గుర్తుంచుకోవాలి, ఆయనను రాజ్యసభకు వరకు తీసుకెళ్లింది అరవింద్ కేజ్రీవాల్” అని ఆమె తెలిపారు.
పంజాబ్ ప్రభుత్వం ఎందుకు తీసేసింది?
రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న విషయంపై ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. కానీ, ఆయనకు భద్రతను తొలగించడానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలు అనుమానాలు రేకెత్తించింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాఘవ్ చద్దాను రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగించిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది.


