
సాక్షి,నరసరావుపేట/చిలకలూరిపేట: జనసేన అధినేత పవన్కల్యాణ్కు మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై మంగళవారం మంత్రి విడదల రజిని చిలకలూరిపేటలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ పవన్కల్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని తెలిపారు.
ఆయన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టుగా ఉంటుందనే విషయం జనసేన కార్యకర్తలకూ తెలిసిపోయిందని చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ పయనిస్తున్నాడని, ఇప్పటి వరకు ముసుగులో ఉన్న వారిద్దరు ఈరోజు ముసుగు తొలగించుకుని బయటకు వచ్చారని మంత్రి విమర్శించారు.
బాబూ.. ఏ ముఖం పెట్టుకుని పర్యటనలు?
అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలనకు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తారని రజిని ప్రశ్నించారు. అధిక వర్షాల వల్ల పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అన్నదాతలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. బాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులకు ఎంతో మేలు చేకూరుతున్నదని మంత్రి విడదల రజిని చెప్పారు.