ఉత్సవాలు, ఈవెంట్ల కోసం రూ.150 కోట్లు
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వేడుకల పేరిట భారీ బడ్జెట్
ఏపీటీడీసీ హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి గాలికి
అస్మదీయులకు దోచిపెట్టేందుకు ఉత్సవాల పేరుతో భారీ డ్రామా
తాజాగా ఆవకాయ పేరుతో అమరావతిలో రూ.5 కోట్లతో ఉత్సవ్
గతంలో ఇలానే శక్తి విజయోత్సవ్ పేరుతో సీఎం సతీమణి ప్రసంగానికి రూ.7 కోట్లు ఖర్చు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసి ఉత్సవాలు, ఈవెంట్ల పేరుతో దోపిడీ పర్వానికి తెరలేపింది. అధికారం చేపట్టినప్పటి నుంచి భారీగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తూ తన అనుయాయ సంస్థలకు భారీగా దోచిపెడుతోంది. ఇప్పటికే శక్తి విజయోత్సవ్, వరల్డ్ టూరిజం డే పేరిట భారీ అవినీతికి పాల్పడిన సర్కారు తాజాగా అమరావతిృఆవకాయ అంటూ మరో లూటీ ఈవెంట్కు సిద్ధమవు తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా కుంటుపడింది. ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎకో, తీర ప్రాంతాలు వంటి పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది. వీటిని అభివృద్ధి చేయకుండా ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా భూ పందేరాలు, ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంతోనే పబ్బం గడిపేసింది. తమ బినామీ సంస్థలు, అనుయాయులకు ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్ను వంతులు వేసి మరీ కేటాయించి అప్పనంగా దోచిపెడుతోంది. తాజాగా ‘అమరావతి–ఆవకాయ’ అంటూ హడావుడి చేస్తోంది.
ఈ వేడుకల నిర్వహణ కోసం నిధులు ఖర్చు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ.. పర్యాటక ఆస్తులను అభివృద్ధి చేయడంలో చూపించట్లేదు. ఇప్పటివరకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసమంటూ భారీ స్థాయిలో పర్యాటక రోడ్షోలు, పండుగలు, ఫెయిర్స్ నిర్వహణకు ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేస్తుండడం విస్తుగొలుపుతోంది. వాస్తవానికి ప్రభుత్వం కేవలం ప్రచారాల కోసం పెట్టిన ఈ బడ్జెట్.. ఒక వార్షిక ఏడాదిలో ఏపీటీడీసీ నికర రాబడులతో సమానంగా ఉండటం గమనార్హం.
అప్పుడు శక్తి విజయోత్సవ్.. ఇప్పుడు ఆవకాయ్!
చంద్రబాబు సర్కారు జనవరిలో విజయవాడలో ‘అమరావతి–ఆవకాయ్’ పేరుతో ఉత్సవం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మూడు రోజుల ప్రోగ్రామ్కి ఏకంగా రూ.5 కోట్లు బడ్జెట్ కేటాయించింది. తెలుగు సాహిత్యం, సినిమా వైభవాన్ని చాటేందుకు ఉత్తరాదికి చెందిన ‘టీమ్ వర్క్ ఆర్ట్స్’కు బాధ్యతలిచ్చింది. అయితే, టెండర్లు లేకుండా ఎంప్యానల్ చేసిన సంస్థల్లో ఒక సంస్థకు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది.
గతంలోనూ ఇదే రీతిలో 2024 దసరా పండుగ సమయంలో శక్తి విజయోత్సవ్ పేరుతో తూతూ మంత్రంగా చేపట్టి ఏకంగా రూ.7 కోట్లు తమ అనుయాయులకు దోచిపెట్టింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగం చేయడంతో ఈ ప్రోగ్రామ్కు బడ్జెట్ అంచనాలకు మించి బిల్లులు చెల్లించింది. తొలుత శక్తి విజయోత్సవానికి రూ.2 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. ఆ తర్వాత మరో రూ.5 కోట్లు అదనంగా కేటాయిస్తూ మొత్తం రూ.7 కోట్లకు ఉత్తర్వులు ఇచ్చింది.
అంతా ప్లాన్ ప్రకారమే..
గతంలో శక్తి విజయోత్సవ్ను హైదరాబాద్కు చెందిన ఓ ఈవెంట్ కంపెనీకి డమ్మీ టెండర్ల ద్వారా కాంట్రాక్టు అప్పగించింది. సదరు కంపెనీ 2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇలాంటి ఈవెంట్లు ఎన్నో చేసింది. సదరు కంపెనీ ఇటీవల ఎన్నికల్లో అధికార పార్టీకి ఫండింగ్ చేయడంతో.. అందుకు లబ్ధి చేకూర్చేందుకు పర్యాటక శాఖలో శక్తి విజయోత్సవ్ షోల నిర్వహణ అప్పగించింది. వాస్తవానికి మొదటి రోజు సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభం అయితే సీఎం సతీమణి భువనేశ్వరి నారీ శక్తిపై ప్రసంగించారు. ప్రభుత్వంలోని కొంత మంది మంత్రులు హాజరయ్యారు. రాత్రి 10 గంటల్లోపే కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత రెండు రోజులు సాయంత్రం పూటే తూతూ మంత్రంగా చిన్నారుల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేసినా రూ.కోటి, రూ.కోటిన్నర కూడా బడ్జెట్ దాటని కార్యక్రమానికి కళ్లు చెదిరేలా రూ.7 కోట్లు విడుదల చేయడం నిధుల దుర్వినియోగానికి అద్దం పట్టింది. పైగా ప్రైవేటు స్థలం వినియోగించుకున్నందుకు యజమానికి ఒక్కపైసా కూడా చెల్లించకుండా వేధించింది. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి పాస్లు పూర్తిగా దుర్వినియోగం అవ్వగా, కనీసం డ్యూటీలో ఉన్న పర్యాటక శాఖ ఉద్యోగులకూ పాస్లు అందని పరిస్థితి. ఇందులో ఏపీ టూరిజం అథారిటీలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తూ ఎనిమిదేళ్లుగా ఒకే చోట పాతుకు పోయిన ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.
ఆయనకు సంబంధం లేని ఈవెంట్ విభాగాన్ని రాజకీయ నాయకుల ఒత్తిడితో చేజిక్కించుకుని కథను నడిపించారని సమాచారం. ఫైల్ నిర్వహించడం దగ్గర నుంచి బిల్లుల అప్లోడ్ వరకు అన్నీ తానై వ్యవహరించారని, ఇందుకు ప్రతిగా బిల్లుల్లో ఒకశాతం కమీషన్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేమాదిరిగా సెప్టెంబర్లో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలోనూ భారీగా నిధులు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అమరావతి–ఆవకాయ్లో కూడా ఇదే తంతు నడుస్తోందని వినికిడి.
మౌలిక వసతులు మృగ్యం..
గత ప్రభుత్వ హయాంలో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు హరిత హోటళ్ల అప్గ్రేడేషన్ను చేపట్టింది. 12 హోటళ్లలో సుమారు రూ.78 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల చిన్న మొత్తంలో పనులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేసింది. ఫలితంగా హోటళ్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది.
రూ.కోట్లు ఖర్చు చేసి రూపురేఖలు మార్చిన ఆ హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఏకంగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను సైతం కూటమి సర్కారు ఆహ్వానించింది. ఈ క్రమంలో సగానికిపైగా హోటళ్ల ఆదాయం క్షీణించింది. పైగా అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ప్రైవేటు హోటళ్లకు వెళ్లి జేబులు గుళ్ల చేసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితిలో పర్యాటకుల ఆకర్షణ కోసం పండుగలు నిర్వహిస్తామంటూ సర్కారు రూ.కోట్లు వృథా చేయడం గమనార్హం.


