సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయ్ కుమార్ రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు రాజీనామా లేఖలు అందించారు. రాజీనామా అనంతరం,తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (హైవేలు, భవనాలు, మైనర్ పోర్టులు) మంత్రి అధవ్ అర్జున్తో భేటీ అయ్యారు.
ఇటీవల అధికారం చేపట్టిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం చేపట్టారు. ఈ విశ్వాస తీర్మానంలో అన్నాడీఎంకేలోని వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చారు. ఆ 25 మందిలో ఇవాళ అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
మే 13 టీవీకే ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో గెలవడానికి వేలుమణి శిబిరం 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే కన్వినర్ ఎడప్పాడి పళనిస్వామి టీవీకేకు మద్దతు ఇచ్చిన ఈ 25 మందిని పార్టీ పదవుల నుండి తొలగించాలని కోరుతూ స్పీకర్కు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెట్టారు. ఈ వరుస పరిణామాలతో వేలుమణి వర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈపీఎస్ శిబిరంలో చేరగా.. మరికొంత మంది అంతర్గతంగా టీవీకే వైపు మొగ్గు చూపారు. సత్యభామ, మరగాథం, జయ్ కుమార్తో పాటు మరికొంత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


