తలసాని v/s రాజగోపాల్‌రెడ్డి.. ‘కాంట్రాక్టర్లపైనే ధ్యాస’.. ‘తెల్లారితే పేకాటే’ | Talasani Srinivas Yadav Vs Komatireddy Rajagopal Reddy In Assembly | Sakshi
Sakshi News home page

తలసాని v/s రాజగోపాల్‌రెడ్డి.. ‘కాంట్రాక్టర్లపైనే ధ్యాస’.. ‘తెల్లారితే పేకాటే’

Mar 15 2022 9:16 AM | Updated on Mar 15 2022 10:11 AM

Talasani Srinivas Yadav Vs Komatireddy Rajagopal Reddy In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఆయనో కాంట్రాక్టర్‌.. ప్రజా సమస్యల గురించి అడగడు. దృష్టంతా కాంట్రాక్టర్ల మీదే..’’ – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వ్యాఖ్య ఇది. 

‘‘ఇప్పుడు నేను కాంట్రాక్టర్‌ను కాదు.. ప్రజాజీవితంలో ఉన్న ఎమ్మెల్యేను. పొద్దున లేస్తే పేకాటలో ఉండే శ్రీనివాసయాదవ్‌ నన్ను అనటమేంటి?’’ – తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు రాజగోపాలరెడ్డి కౌంటర్‌ ఇది. 

నేతల మధ్య సోమవారం జరిగిన ఈ వాగ్వాదంతో రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. తలసాని, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ, క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్‌ చేయడంతో గందరగోళం నెలకొంది. మొదట అసెంబ్లీలో పద్దులపై చర్చలో భాగంగా టీఆర్‌ఎస్‌ సర్కారుపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు చేశారు.  ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట్ల గ్రామాలకు కేంద్ర నిధులు విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డికి శ్రీధర్‌బాబు మద్దతు ప్రకటించారు. 

నన్ను కాంట్రాక్టర్‌ అంటారా..?  
టీఆర్‌ఎస్‌ సర్కారు లక్షల కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని.. స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులివ్వక వేధిస్తోం దని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న మంత్రి తలసాని.. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టర్‌ కావటంతో ఆయన దృష్టంతా కాంట్రాక్టర్లపైనే ఉంటుందని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన చిన్న కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే.. తాను కాంట్రాక్టర్‌నంటూ ఎలా అంటారని మండిపడ్డారు. పొద్దున లేచినప్పటి నుంచి పేకాటలో మునిగే తలసాని తన గురించి మాట్లాడటమేమిటన్నారు. 
చదవండి: కీసరగుట్టలో అడవుల్లో కార్చిచ్చు

క్షమాపణ చెప్పాల్సిందే.. 
బలహీనవర్గాల నేత తలసానిపై రాజగోపాల్‌ వ్యాఖ్యలు సరికాదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరగా.. ఆయన తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయినా అధికారపక్ష సభ్యులు కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన రాజగోపాల్‌.. ‘నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అని మాత్రమే చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో తలసానికి క్షమాపణ చెప్పించాలని ఈ సందర్భంగా భట్టికి స్పీకర్‌ సూచించారు. కానీ భట్టి స్పందిస్తూ.. తలసాని, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరి వ్యాఖ్యలు సరికావని, రెంటినీ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. 

కాంగ్రెస్‌ నేత జుగుప్సాకర మాటలు: కేటీఆర్‌ 
సభలో కాంగ్రెస్‌ సభ్యులు, బయటనేమో వారినేత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ సాధించిన నేతగా ఇటీవల కేసీఆర్‌ పుట్టినరోజును సంబురంగా జరుపుకోవాలని మేం పిలుపునిస్తే.. కాంగ్రెస్‌ నాయకుడేమో 3రోజులు సంతాప దినాలు జరుపుకోవాలన్నారు. ఇటీవల చిన్న ఆరో గ్య సమస్యతో సీఎం ఆస్పత్రికి వెళ్తే.. ముందురోజు వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో బలహీనవర్గాలకు చెందిన మంత్రిని పేకాట ఆడుతారంటారా? స్కాంలో కూరుకుపోయిన దౌర్భాగ్యపు పార్టీ వాళ్లా అవినీతి గురించి మాట్లాడేదని మండిపడ్డారు. 
చదవండి: ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్‌ చూడకండి: కేటీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement