చంద్రబాబు, లోకేశ్ ఎక్కడ దాక్కున్నారు?
దళిత నాయకుడు హత్యకు గురైతే మాట్లాడరేం?
ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి
నంద్యాలలో దళిత సంఘాల భారీ ధర్నా
నంద్యాల: రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ నంద్యాలలో దళిత నాయకుడు నాగ సుబ్బరాయుడు హత్యకు గురైతే ఎందుకు మాట్లాడటం లేదని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతరులతో ఎన్నడూ ఘర్షణ కూడా పడని సుబ్బరాయుడును టీడీపీ నాయకులు కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం హతమార్చడం దారుణమన్నారు. ప్రశాంతతకు నెలవైన నంద్యాల నియోజకవర్గంలోకి భూమా కుటుంబం అడుగుపెట్టినప్పటి నుంచి హత్యలు, దాడులు జరుగుతున్నాయన్నారు. ఇలావుండగా.. సుబ్బరాయుడు హత్యపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలంటూ శుక్రవారం నంద్యాల పట్టణంలో ధర్నా నిర్వహించాయి.
సుబ్బరాయుడు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక..
నంద్యాలలో టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొన్నాపురానికి చెందిన సుబ్బరాయుడు వైఎస్సార్సీపీ నేతగా, న్యాయవాదిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడేవారు. ఇటీవల ఆయన పొన్నాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ నెల 9న హత్యకు గురయ్యారు. సుబ్బరాయుడు ఎదగడం జీరి్ణంచుకోలేక టీడీపీ నేత మనోహర్గౌడ్ ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారనే ఆరోపణలున్నాయి. మనోహర్గౌడ్, అతని అనుచరులు కడమ రవికుమార్, బోయమండ్ల సురేంద్ర, కాట్రావత్ సత్యహరినాయక్ పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో సైతం వెల్లడైనట్లు సమాచారం.