ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు | Sabitha Indra Reddy Comments On Revanth Reddy: telangana | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు

Jul 17 2024 5:22 AM | Updated on Jul 17 2024 5:22 AM

Sabitha Indra Reddy Comments On Revanth Reddy: telangana

రేవంత్‌పై ఓడిన అభ్యర్థిని వేదిక మీద కూర్చోబెడతారా? 

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

 సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వíహిస్తున్న నియోజకవర్గాల్లో తమపై ఓడిన కాంగ్రెస్‌ అభ్యర్థులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌తో భేటీ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరునెలలుగా ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తూ తనపై పోటీచేసి ఓడిన కాంగ్రెస్‌ అభ్యరి్థతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీఆర్‌ఎస్‌ తరపున ఓడిన అభ్యర్థులను వేదిక మీదకు పిలవాలన్నారు. సీఎం రేవంత్‌ కూడా కొడంగల్‌లో ఓడిన బీఆర్‌ఎస్‌ అభ్యరి్థని వేదిక మీద కూర్చోబెట్టాలని చెప్పారు. హుజూరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆసిఫాబాద్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు పెడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 
ఎర్రబుగ్గలు వేసుకొని 

తిరుగుతున్నారు: సునీతా లక్ష్మారెడ్డి 
ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలను కాదని, కాంగ్రెస్‌ నాయకులను అతిథులుగా పిలుస్తున్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థులు వాహనాలపై ఎర్రబుగ్గలు వేసుకొని తిరుగుతున్నారని, స్పీకర్‌కు తెలియకుండా ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. 

అసెంబ్లీకి కూడా అనుమతించండి : పద్మారావుగౌడ్‌ 
తమపై ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రభుత్వ కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నారని సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థులను కూడా శాసనసభకు అనుమతించాలని స్పీకర్‌కు సూచించానని చెప్పారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement