ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ మే 4న విడుదల కానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై గురువారం ఆమె ఓ వీడియోని విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఢీలా పడ్డ టీఎంసీ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోశారు.
ఆ వీడియోలో దీదీ మాట్లాడాతూ.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లకు మించి గెలుస్తుంది. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, ఫలితాలు దానికి సాక్ష్యం చెబుతాయి’అని అన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. బీజేపీ తరఫున ఎగ్జిట్ పోల్స్లో చూపిన ఆధిక్యం కేవలం మానసిక ఒత్తిడి సృష్టించడానికే అని ఆమె ఆరోపించారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒకవైపు బీజేపీకి ఆధిక్యం చూపుతున్నప్పటికీ,మమతా బెనర్జీ ధైర్యవంతమైన ప్రకటన మరోవైపు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఫలితాలు వెలువడే వరకు ఈ పోటీ ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది.


