సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యాగ్‌మ్యాన్‌ | KTR Comments on CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యాగ్‌మ్యాన్‌

May 24 2025 3:26 AM | Updated on May 24 2025 3:26 AM

KTR Comments on CM Revanth Reddy

ఈడీ చార్జిషీట్‌తో ఆయన బండారం బయట పడింది 

ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో కొత్త నాటకం 

ఏడాదిన్నరలో రూ.వేల కోట్లకు చేరిన సీఎం అవినీతి  

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీట్‌లో చేర్చటంతో ఆయన అవినీతి బండారం బయట పడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ పార్టీకి ఏటీఎంలా మారిందని ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నాయని అన్నారు. ఈడీ చార్జిషిట్‌లో పేరు రావడంతో ‘తెలంగాణ బ్యాగ్‌ మ్యాన్‌’రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టి మళ్లించే డ్రామాలు మొదలు పెట్టారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తన అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకు రేవంత్‌ రోజుకో కొత్త నాటకం వేస్తున్నారని ఆరోపించారు.

ఈడీ చార్జిషిట్‌లో రేవంత్‌ పేరు నమోదైనందున కేంద్రం ఆయనపై చర్యలు తీసుకుంటున్నదీ లేనిదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో అమృత్‌ స్కామ్, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ కుంభకోణం, పౌర సరఫరాల స్కామ్‌ వంటి వాటిని చూసీ చూడనట్లుగా వదిలేసిన రీతిలోనే కేంద్రం నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విషయంలోనూ వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు. 

అధికారం కోసం వందల కోట్లు 
సీఎం పదవి చేపట్టకముందే అధికారం కోసం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పెద్దలకు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన వ్యవహరం ఈడీ చార్జిషిట్‌లో బయటపడిందని కేటీఆర్‌ అన్నారు. యంగ్‌ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్‌రెడ్డి ప్రలోభపెట్టిన విషయం ఈడీ చార్జిషిటులో బయట పడిందని తెలిపారు. వందల కోట్లతో మొదలైన రేవంత్‌ అవినీతి బాగోతం ఏడాదిన్నరలోనే సీఎం పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి తరహాలోనే రేవంత్‌ చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటారా? అని ప్రశ్నించారు.

కేవలం చార్జిషిట్‌లో రేవంత్‌ పేరు నమోదుతో సరిపెట్టకుండా విచారణకు పిలిచి అవినీతిని కక్కించాలని డిమాండ్‌ చేశారు. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్‌ కకావికలమైందని, తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడు దిగాల్సి వస్తుందో అనే భయం రేవంత్‌ను అడుగడుగునా వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. కమిషన్లు లేనిదే ఫైలు కదలడం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పారని, 30 శాతం పర్సంటేజీపై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ నిజ స్వరూపం బయట పడిందని అన్నారు. ప్రజల ముందు సీఎం అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్‌ పార్టీ కొట్టుకుంటోందని విమర్శించారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం పాపం పండిందని, ధర్మమే గెలుస్తుందని కేటీఆర్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement