మోతీలాల్‌కు ఏదైనా జరిగితే రేవంత్‌దే బాధ్యత: హరీష్‌ రావు | Harish Rao Serious Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

మోతీలాల్‌కు ఏదైనా జరిగితే రేవంత్‌దే బాధ్యత: హరీష్‌ రావు

Jun 30 2024 1:45 PM | Updated on Jun 30 2024 2:53 PM

Harish Rao Serious Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను ఎన్నికల కోసమే వాడుకుంది. కాంగ్రెస్‌ నాయకులకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకు విడుదల చేయలేదో సీఎం రేవంత్‌, కోదండరామ్‌ సమాధానం చెప్పాలన్నారు.

కాగా, హరీష్‌ రావు ఆదివారం గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏడురోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా దీక్ష విరమించాలని కోరారు. అనంతరం, హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. మోతీలాల్‌ దీక్ష చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు దీక్ష విరమించనని మోతీలాల్‌ అంటున్నాడు. మేము దీక్ష విరమించాలని కోరాము. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.

మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతీలాల్‌ మాట్లాడాలి. లేదంటే అసెంబ్లీని స్తంభింపజేస్తాం. బీఆర్‌ఎస్‌ నిరుద్యోగుల పక్షాన నిలబడుతుంది. నిరుద్యోగుల బాధ్యత కోదండరామ్‌ తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం మొద్ద నిద్రలో ఉంది. నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకుంది. వారంతా ఇప్పుడు అశోక్‌ నగర్‌లో కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులకు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. రాహుల్‌ గాంధీ అశోక్‌ నగర్‌ వచ్చి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని అన్నాడు. కానీ, ఇంతవరకు అతీగతీ లేదు.

ఈ విషయంలో రాహుల్‌ గాంధీకి ట్విట్టర్‌లో మెసేజ్‌ కూడా చేస్తున్నాం. రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క జాబ్‌ క్యాలెండర్లు విడుదల చేస్తామని సంతకాలు కూడా చేశారు. రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. ప్-2, గ్రూప్-3లో ఉద్యోగాలు పెంచాలి. జీవో-45 ఎందుకు రద్దు చేయడం లేదు. 25వేల మెగా డీఎస్సీ విడుదల చేయాలి’ అని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement