ఎన్జీఆర్ఐలో రెయిన్ గార్డెన్ను ప్రారంభిస్తున్న శైలేష్ నాయక్, డా. ప్రకాశ్ కుమార్ తదితరులు
పట్టణాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పరిశోధన
ఉప్పల్ (హైదరాబాద్): జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ప్రాంగణంలో పైలెట్ ప్రాజెక్ట్గా రెయిన్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పరిశోధనా మండలి చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత శైలేష్ నాయక్ ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డా.ప్రకాశ్ కుమార్, చీఫ్ సైంటిస్టులతో కలిసి ప్రారంభించారు. శాస్త్రాధారిత కార్యక్రమం ద్వారా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహాయంతో పట్టణాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం, భూగర్భ జలాల స్థాయిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డా.ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ 2007లో ప్రయోగంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విశేషమైన ఫలితాలు అందించినట్లు చెప్పారు. ఎన్జీఆర్ఐ ప్రాంగణంలో తొమ్మిది ఇంకుడు గుంటలు, ఒక రెయిన్ గార్డెన్ నిర్మించి వర్షపు నీటిని సేకరించి భూమిలోకి ఇంకే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి సుమారు 200 ఘనపు మీటర్ల నీరు సేకరించగా భూగర్భజల మట్టం సుమారు 1.5 మీటర్లు పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు. అలాగే రోజుకు సుమారు 46వేల లీటర్ల నీటిని తోటపని అవసరాల కోసం స్థిరంగా వినియోగించగల సామర్థ్యం ఏర్పడిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఈ విధంగా చేయడం ద్వారా సమర్ధవంతంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి మంచి ఫలితాలను పొందవచ్చని చెప్పారు.


