చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంశానికి సంబంధించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిందేనన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటు అనేది అత్యవసరమన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ సభ్యుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రస్తుత శాసనసభ ఇప్పటికే రద్దు చేయబడింది. గౌరవనీయ గవర్నర్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఇటువంటి పరిస్థితులలో, ఎన్నికైన వారి కోసం ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కేవలం కాలపు అవసరం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం కూడా.…
ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు, రాజ్యాంగం ప్రకారం కొత్త పరిపాలనను ఏర్పాటు చేయడానికి గౌరవనీయ గవర్నర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ద్రవిడ మున్నేట్ర కజగం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
தமிழ்நாடு சட்டமன்றத் தேர்தல் முடிவுகள் வெளியாகி, மக்களால் தேர்வு செய்யப்பட்ட சட்டமன்ற உறுப்பினர்களின் பட்டியலைத் தேர்தல் ஆணையம் வெளியிட்டு விட்டது. ஏற்கனவே இருந்த சட்டமன்றத்தையும் கலைத்து மாண்புமிகு ஆளுநர் அவர்கள் ஆணையும் பிறப்பித்து விட்டார். இப்படியொரு நிலையில், தேர்தலில் வென்ற…
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 8, 2026
కాగా, మిత్ర పక్షాలతో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం(మే 7వ తేదీ) భేటీ అయ్యారు. సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలతో సమావేశమైన స్టాలిన్.. టీవీకేకు మద్దతు అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మిత్రపక్షాలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే నేడు(శుక్రవారం, మే 8వ తేదీ) వామపక్షాలతో పాటు వీసీకే కూడా టీవీకేకు మద్దతు తెలిపింది. దాంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయ్యింది.
ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సభ్యుల సంఖ్య 118కి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్ తమ మద్దతును ప్రకటించగా, తాజాగా వామపక్షాలు, వీసేకే నుంచి మద్దతు లభించడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలోనే విజయ్ సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి.


