
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ‘‘సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అడ్డగోలు షరతులతో కొందరికే పథకాన్ని పరిమితం చేశారు. తల్లులను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబూ’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.
‘‘ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా?. తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ విద్యాలయం (KV) విద్యార్థుల్ని మొత్తానికి మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా?’’ అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
‘‘గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లీకి అమ్మ ఒడి లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు, దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు వాపోతున్నారు.
..పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ, మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో వుంది. అందుకే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు.’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.
