సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) పూర్వ వైభవం తీసుకురావడానికి సాధారణ నిరసనలు సరిపోవని, ఉధృతమైన క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సింగరేణి ఆఫీసులు తగలబెట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తాజాగా మాట్లాడుతూ.. టీబీజీకేఎస్కు పూర్వ వైభవం తీసుకురావడానికి మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేయాలి. సింగరేణి ఆఫీసులు తగలబెట్టాలి. రైల్వే పట్టాలను కోసిపారేయండి. కేవలం అంతర్గత సమావేశాలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితం కాకుండా ఇలాంటివి చేయాలి. ప్రజాసమస్యలపై గట్టిగా నిలబడి పోరాడే క్రమంలో కేసులు ఎదురైనా, జైలుకు వెళ్లాల్సి వచ్చినా వెనకడుగు వేయవద్దు. కాంగ్రెస్ పాలన మూడేళ్లకు చేరుకుంటున్న తరుణంలో, గట్టిగా ఒత్తిడి తెస్తేనే కార్మిక వర్గం తమ వైపు నిలుస్తుందని పేర్కొన్నారు.
బాల్క సుమన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ..‘బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు చట్ట వ్యతిరేకం. సుమన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఆయన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. రైలు పట్టాలు కోసేస్తే ఎంత ప్రమాదమో తెలియదా?. పట్టాలు కోసేస్తే యాక్సిడెంట్ అయి ప్రజలు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు. సింగరేణి ఆఫీసును తగలపెడతారా? సింగరేణి కార్మికులు సుమన్పై తిరగబడాలి. బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఇంత ఫస్ట్రేషన్. రైతులు రోడ్లపైకి రావడం లేదని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. కృత్రిమ ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ చూస్తుంది’ అంటూ మండిపడ్డారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ..‘సుమన్ పేపర్ పులి. ప్రజల కోసం బీఆర్ఎస్ ఏమైనా చేస్తోందా?. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. తగలబెట్టడం, కూలగొట్టడం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాట్లాడాలి’ అని డిమాండ్ చేశారు.


