BJP MLA Raghunandan Rao Unhappy on Party Internal Issues - Sakshi
Sakshi News home page

అంతర్గత విబేధాలు.. సైలెంట్‌ మోడ్‌లోకి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

Jun 29 2023 6:51 PM | Updated on Jun 29 2023 7:39 PM

BJP MLA Raghunandan Rao Unhappy on Party Internal Issues - Sakshi

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ, అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. పార్టీలోని కీలక నేతల్లో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై పలువురు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బండి సంజయ్‌కు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మధ్య పొసగటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్‌ దుమారం రేపుతోంది.

తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే సైలెండ్‌ మోడ్‌లోకి వెళ్లారు. ఆయనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. ఆయన ఈ మధ్య పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వానికి, రఘునందన్‌ రావుకు మధ్య గ్యాప్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న రఘునందన్‌ రావు.. ఇదే విషయంపై ఇటీవల జేపీ నడ్డాకు  ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణ బీజేపీపై హైకమాండ్‌ ఫోకస్ పెట్టింది. దీంతో పార్టీ నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌‌ను అధిష్ఠానం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. బండిని ఆ పదవి నుంచి మార్చేసి.. కేంద్రమంత్రి బాధ్యతలు ఇవ్వనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. బండి సంజయ్‌ను తప్పిస్తే.. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వనున్నారన్నది ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement