కోల్సిటీ: రామగుండంలోని పలువురు కార్పొరేటర్లలో అసంతృప్తి రగులుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడాలేకుండా అన్నింటా వ్యాపిస్తోంది. పార్టీలకు అతీతంగా అసంతృప్తితో రగులుతున్న పలువురు కార్పొరేటర్లు బుధవారం మేడారంలోని సమ్మక్క– సారలమ్మ వనదేవతల దర్శనం కోసం తరలివెళ్లడానికి వ్యూహం రచించారని, ఇదే ఇందు కు నిదర్శనంగా నిలుస్తోందనే చర్చ సాగుతోంది. టూర్ కోసం మంగళవారం బల్దియా కార్యాలయంలో కొందరు కార్పొరేటర్లు సమావేశం నిర్వహించ డం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన కేవలం ఆధ్యాత్మిక దర్శనానికే పరిమితం కాకుండా, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకూ వేదిక కానుందని సమాచారం. తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రజాసమస్యలపై తాము ఇచ్చే వినతులను అధికారులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. తమకు ప్రత్యేక వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తోపాటు పలు అంశాలపై ఇటీవల సుమారు 35 మంది కార్పొరేటర్లు బల్దియాలోనే నిరసన తెలిపిన విషయం తెలిసిందే. పురపాలక శాఖ ఇటీవల నిర్వహించిన శిక్షణకు 59 మందిలో ముగ్గురే హాజరుకాగా, మిగిలినవారు బహిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు మేడారం వెళ్లాలని నిర్ణయించుకోవడం రాజకీయ, స్థానిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు మంగళవారం మేడారానికి బయలుదేరినట్లు తెలిసింది. బుధవారం మిగిలినవారు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు రామగుండం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
రామగుండం కార్పొరేటర్ల మేడారం పర్యటన
మూకుమ్మడిగా తరలివెళ్లేందుకు విస్తృత ఏర్పాట్లు
ఒకరోజు ముందుగానే మేడారం చేరిన మరికొందరు
నేడు భారీగా తరలివెళ్లనున్న ‘కార్పొరేషన్’ కార్పొరేటర్లు


