రెండు గంటల్లోనే మొబైల్కు ల్యాబ్ నివేదికలు గుండె పరీక్షలు, ఫిజియోథెరపీ, వార్డుల ఆధునికీకరణ కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
కోల్సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఇందులో ఉచితంగా అందుతున్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్యపరికరాలు, అధునాతన నిర్ధారణ సేవలు, ప్రత్యేక వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రెండు గంటల్లోనే ల్యాబ్ ఫలితాలు
జీజీహెచ్లో ఆధునిక కంప్యూటర్ వ్యవస్థతో రక్తం తదితర పరీక్షల నివేదికలను రెండుగంటల్లోనే సి ద్ధం చేసి, పేషెంట్ల సెల్ఫోన్లకు పంపిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తన ప్రత్యేక చొరవతో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
గుండె పరీక్షలకు రెండు 2డీ ఇకో యంత్రాలు
గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ కోసం రెండు 2డీ ఇకో యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులు గుండె పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
అందుబాటులో ఫిజియోథెరపీ
ఫిజియోథెరపీలో ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, ప్రమాదాల అనంతర పునరావాస చికిత్స అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
వేగంగా అభివద్ధి పనులు
ఆస్పత్రిలో సదుపాయాల మెరుగుకు అభివృద్ధి పనులు చేపట్టామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పాత భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్, ఎక్స్రేను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎన్సీయూ విభాగాన్ని కొత్త ఎయిర్ కండిషనర్లతో ఆధునికీకరిస్తుండగా, ఏఎన్సీ, పీఎన్సీ, పీఐసీయూ వార్డులను కూడా పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. పాత భవనం చుట్టూ సీసీ రోడ్లు, కాంపౌండ్ గోడ ఎత్తు పెంపు పనులు కొనసాగుతున్నాయని, మొదటిఅంతస్తులోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులతోపాటు కంటి ఆపరేషన్ థియేటర్ను ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. మార్చురీ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.


