● మానేరు చెక్డ్యాం గొయ్యిలో పడి బాలుడి మృతి
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన చెలిక ఆదిత్య(15) అలియాస్ లక్కీ అనే పదో తరగతి విద్యార్థి మానేరులో ఈతకోసం వెళ్లి మృతి చెందాడు. పొత్కపల్లిలో పదో తరగతి చదువుతున్న ఆదిత్య.. శుక్రవారం ఒక్కపూట పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఈతకోసం మరో విద్యార్థితో కలిసి మానేరుకు వెళ్లాడు. మానేరులో చెక్డ్యాం నిర్మాణానికి ఇటీవల తీసిన గొయ్యిలో పడి ఊపిరి ఆరాడక ఆదిత్య మృతి చెందాడు. శ్రీనివాస్ – రజిత దంపతులకు కుమారుడు ఆదిత్య, కూతురు ఉంది. ఒక్కాగానొక్క కుమారుడు మృతి చెందటంతో దంపతులు విషాదంలో మునిగారు. ఎస్సై సనత్కుమార్రెడ్డి కేసు నమోదు చేసుకొన్నారు.
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
● ధర్మారంలో విషాదం
కోనరావుపేట(వేములవాడ): సొంతూరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ యువకుడి జీవితం గుండెపోటుతో విషాదాంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్వర్లు(40) ఒమన్ రాజధాని మస్కట్కు మూడేళ్ల క్రితం వెళ్లాడు. వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే పనిచేస్తు ఉన్నాడు. ఈక్రమంలో జూన్ 16న వీసా సంబంధిత కారణాలతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. జూన్ 25న గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందాడు. వెంకటేశ్వర్లు మృతదేహం బంధువుల ద్వారా స్వగ్రామానికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటేశ్వర్లుకు భార్య పుష్పలత, ఇద్దరు కుమారులు మనోజ్, అజయ్ ఉన్నారు.


