కాల్వశ్రీరాంపూర్: తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిపోయిన ఓ రైతు తన సమస్యను విన్న వెంటనే క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించడంతో ఆ రైతు తహసీల్దార్ రాపెల్లి రాముడును సన్మానించాడు. మండలంలోని తారుపల్లికి చెందిన మార్త రాజయ్య గ్రామంలోని 401/ఏ సర్వే నంబరులో 1.05 గుంటల భూమి పదేళ్ల కిందట ధరణి పోర్టల్లో వేరే రైతు పేరున నమోదైంది. తన భూమి తనపేరున సరి చేయాలని అనేక మంది తహసీల్దార్లను కోరాడు. ఎవరూ తన సమస్య పరిష్కరించలేదు. ఇటీవల వచ్చిన తహసీల్దార్ రాపెల్లి రాముడుకు తన సమస్య విన్నవించాడు. సమస్య విన్న తహసీల్దార్.. ఆర్ఐ వినోద్, జీపీవో అన్వర్తో కలిసి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేశారు. వెంటనే రాజయ్య పేరున భూమి తిరిగి పట్టా చేశాడు. దీంతో ఆ రైతు సంతోషం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ను సన్మానించాడు.


