జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన కాముని వరుణ్తేజ (6) విష జ్వరంతో గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన కాముని అర్జయ్య, సరిత చిన్న కుమారుడు వరుణ్ తేజ యూకేజీ చదువుతున్నాడు. బుధవారం జ్వరం రావడంతో తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు కరీంనగర్కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేకాలనీకి చెందిన మరో బాలిక విషజ్వరంతో అపస్మారకస్థితికి వెళ్లింది. జిల్లా వైద్యాధికారి సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపట్టారు.
ఆటో పైనుంచి పడి కార్మికుడు..
కరీంనగర్క్రైం: నగరంలో డిజిటల్ నేమ్బోర్డు ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా ఓ కార్మికుడు కిందపడి చనిపోయాడు. వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన కామారెడ్డి సురేందర్(45) కోతిరాంపూర్లో నివాసముంటూ స్క్రాప్షాపులో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విధులకు వెళ్లాడు. 11గంటల సమయంలో ఆటోట్రాలీలో భారీ డిజిటల్ నేమ్బోర్డు తీసుకెళ్లే క్రమంలో కోతిరాంపూర్లో డ్రైవర్ చింతల సిద్దార్థ్ వాహనాన్ని నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపాడు. సురేందర్ ఆటోలోంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
మంథని: మంథని మండలం గుంజపడుగు గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులతో పాటు రూ.43,540 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు ఇతర వస్తువులను మంథని పోలీస్స్టేషన్ అధికారులకు అప్పగించి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


