పెద్దపల్లి: తెలంగాణ జలసిరి, వీబీజీ రాంజీ ద్వారా జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు పెద్దఎత్తున చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జలసిరి, వీబీజీ రాంజీ పథకాల అమలుపై ఎంపీడీవోలతో కలెక్టర్ తన కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. వీబీజీ రాంజీని సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామాల్లో నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రధానంగా నీటికుంటలు, ఇంకుడుగుంతలు, ఊటకుంటలు, బోరుబావుల రీచార్జి చేయాలని సూచించారు. ఆగస్టు ఒకటో తేదీ పనులు చేయాలని చెప్పారు. సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతీనీటి చుక్కను ఒడిసిపట్టాలని అన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


