కోతలు లేవు సరే.. నాణ్యత ఏది? | - | Sakshi
Sakshi News home page

కోతలు లేవు సరే.. నాణ్యత ఏది?

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

● ధాన్యంలో తప్ప, తాలు, రాళ్లు ● నాణ్యతపై రైస్‌ మిల్లర్ల ఆందోళన ● రపీ క్లీనర్‌/తాలు తీసే యంత్రాలు : గడ్డి పరకలు మిల్లు లోపలి రబ్బర్‌ రోలర్లకు చుట్టుకుని త్వర గా అరిగిపోతాయి. మిషన్‌ జామ్‌ అవుతుంది. ● డీ–స్టోనర్‌/రాళ్లు తీసే యంత్రం : రాళ్లు, ఇసుక, రబ్బర్‌ రోలర్‌, ఎమరీ రోల్‌, పాలిషర్‌ను కోసేస్తాయి. ఒక చిన్నరాయితో రూ.10,000 – రూ.50,000 విలువైన రోలర్‌ పాడవుతుంది. మిషన్‌ విరిగే ప్రమాదం కూడా ఉంది. మాగ్నెట్‌, ఇనుప ముక్కలు, మేకులు ఉంటే బ్లేడ్లు విరిగిపోతాయి. నిప్పు రవ్వలు ఎగిసి అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ● బ్రోకెన్‌ 25 శాతం పెరుగుతుంది : రాళ్లు, తాలు మధ్య ధాన్యం నలిగి బియ్యం ముక్కలయ్యే అవకాశం 5శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది. తద్వారా ఒక క్వింటాల్‌పై 20 కేజీల వరకు నష్టం వాటిల్లుతుంది. ● గ్రేడ్‌ పడిపోతుంది : మిల్లర్లు తాలు, రాళ్లు ఒకశాతం ఉంటే రిజెక్ట్‌ చేస్తారు. క్వింటాల్‌పై రూ.200 – రూ.400 వరకు ధర తగ్గిస్తారు. ఏ–గ్రేడ్‌ ధాన్యం ఒక్కసారిగా సీ–గ్రేడ్‌కు పడిపోతుంది. పాలిష్‌ సందర్భంగా తాలుతో బి య్యం ఉపరితలం గీరి, నూక 8 శాతం నుంచి 10 శాతం వరకు పెరుగుతుంది. తాలు, పొట్టు లో తేమ ఉంటే పురుగు పట్టి లాట్‌ మొత్తం పాడవుతుంది. దుమ్ము అధికంగా వెలువడి వర్కర్లకు ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుంది.

పెద్దపల్లి: ధాన్యంలో కోత విధించకుండా అన్‌లోడ్‌ చేసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు రైస్‌మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. తప్ప, తాలు, రాళ్లు కలిసిన వడ్లు తీసుకుంటే తమకు నష్టాలు వస్తున్నాయని మరోవైపు రైస్‌ మిల్లర్లు చెబుతున్నారు. తప్ప, తాలు, రాళ్లతో కూడిన ధాన్యం తూకం వేశాక లారీలో లోడ్‌చేసి మిల్లుకు తరలిస్తే.. ఒక్కో క్వింటాల్‌పై 8 కిలోల వరకు తరుగు వస్తోందని పేర్కొంటున్నారు. కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరుతోనే ఈ సమస్య తలెత్తుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.

334 కొనుగోలు కేంద్రాలు.. 150 తేమశాతం యంత్రాలు..

జిల్లాలో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో ధాన్యంలో తేమశాతం నిర్ధారించేందుకు ఆటోమేటిక్‌ మ్యాచర్‌ యంత్రాలు 150, మాన్యువల్‌ యంత్రాలు 350 ఉన్నాయి. ఈ సీజన్‌లో జిల్లాలోని 125 రైస్‌ మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఇప్పటి వరకు 1,78,000 మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఈమొత్తాన్ని రైస్‌ మిల్లులకు వాహనాల ద్వారా తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లు యజమాని.. ధాన్యంలో తప్ప, తాలు ఉందని, ఇలాంటి వడ్లు తీసుకుంటే తమకు నష్టం వస్తుందని, అందుకే అన్‌లోడ్‌ చేసుకోబోమని తెగేసి చెప్పారు. రైతులకు ఏం చేయాలో తోచలేదు. ఇది ఆ ఒక్కమిల్లు సమస్యే కాదు.. దాదాపు అన్ని రైస్‌ మిల్లులదీ ఇదే పరిస్థితి. నిర్దేశిత 17శాతం తేమ వచ్చాకే ధాన్యం తూకం వేయాలని, ఈ నిబంధనేదీ పాటించకుండా వడ్లు తూకం వేయడంతో సమస్య తలెత్తుతోంది. తప్ప, తాలు, రాళ్లు, మట్టిపెళ్లలు లాంటి కల్తీ కలిగిన ధాన్యం మరపట్టిస్తే బియ్యంలో నూకల శాతం అధికంగా ఉంటోందని ఎఫ్‌సీఐ అధికారులు చెబుతున్నారు. ఇట్లాంటి వడ్లు తీసుకునేదిలేదని రిజెక్ట్‌ చేస్తున్నారు.

మిల్లర్లు ఏం చెబుతున్నారంటే..

నాణ్యతలోనూ సమస్యలు

కొందరితోనే సమస్య

కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతోనే తప్ప, తాలు, రాళ్లతో కూడిన ధాన్యం వస్తోంది. నిర్దేశిత తేమశాతం వచ్చిన తర్వాతే తూకం వేయాలని ఆదేశాలు జారీ చేశాం. మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నారు. కొందరే అమలు చేయడం లేదు. ఇప్పటివరకు తూకం వేసిన 1.78 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 125 రైస్‌ మిల్లులకు చేరవేశాం. కొనుగోళ్లను మరింత వేగవంతం చేస్తాం.

– శ్రీకాంత్‌, డీఎం, సివిల్‌ సప్లయ్‌

Advertisement
 
Advertisement
Advertisement