గోదావరిఖని(రామగుండం): బొగ్గు గనులు, కార్మికవాడలను అనుసంధానిస్తున్న నిర్మించిన కోల్కారిడార్ వెంట ఆర్టీసీ బస్సు సౌకర్యంలేక సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు ప్రయాణం చేస్తున్నాయి. బస్సు సౌకర్యం సకాలంలో గమ్యస్థానాలు చేరుకోలేపోతున్నారు.
గోదావరిఖని, సెంటినరీకాలనీ నుంచి..
గోదావరిఖని, చౌరస్తా, ఫైవింక్లయిన్, వీర్లపల్లి, యైటింక్లయిన్కాలనీ, పోతనకాలనీ, సెంటినరీకాలనీ నుంచి భూపాలపల్లి, మణుగూరు వరకు ఆర్టీసీ బస్సు నడిపిస్తే కార్మికులు, వారి కుటుంబాలకు సౌకర్యంగా ఉంటుంది. పోతనకాలనీ, న్యూమారేడుపాక, యైటింక్లయిన్కాలనీ నుంచి భూపాలపల్లికి వెళ్లే కార్మికులు సుమారు 6 కి.మీ. దూరంలోని జీడీకే–11 వద్ద ఉన్న బస్స్టాప్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. మూడు షిఫ్టులకు వెళ్లే కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల నుంచి నేరుగా ఈప్రాంతాలకు రావాలన్నా బస్సు సౌకర్యం లేదు.
షిఫ్ట్వేళల్లో బస్సులు నడిపించాలి
సింగరేణి కార్మికులు విధులకు హాజరయ్యే మూడు షిఫ్టుల వేళల్లో కోల్కారిడార్ నుంచి గోదావరిఖని, ఫైవింక్లయిన్, పోతనకాలనీ, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీ, మంథని, భూపాలపల్లి, మణుగూరు వరకు ఆర్టీసీ బస్సు నడిపించాలని కోరుతున్నారు. ఇక్కడ నుంచి విధులకు వెళ్లే ఉద్యోగులకు షిఫ్ట్ సమయాలకు రెండుగంటల ముందుగా ట్రిప్పు ఏర్పాటు చేయాలంటున్నారు.
కనెక్టివిటీగా కోల్కారిడార్
సింగరేణి కార్మికులు దూరప్రాంతాల నుంచి తమ కుటుంబ సభ్యుల వద్దకు రావడం, ఇక్కడి నుంచి స్వగ్రామాలకు వెళ్లడానికి కోల్కారిడార్ నుంచి నడిచే ఆర్టీసీ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. గోదావరిఖని నుంచి భూపాలపల్లి వరకు ప్రతీ అర్ధగంటకోసారి బస్సు నడిపినా.. పోతనకాలనీ, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీ నుంచి ఒక్కటి కూడాలేదు.


