విజయనగరం అర్బన్: స్థానిక దాసన్నపేటలోని ఓ ప్రైవేట్ మీటింగ్ హాల్లో ఆర్థిక అక్షరాస్యతపై గురువారం అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణ వినియోగదారుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు, బాధ్యతాయుత రుణ వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాబార్జ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ టి.నాగార్జున పాల్గొని, కేవైసీ పత్రాల భద్రత, వ్యక్తిగత ఆర్థిక సమాచార గోప్యతపై అవగాహన కల్పించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వీవీ రమణమూర్తి మాట్లాడుతూ అనధికారిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవద్దని, రుణమాఫీపై వచ్చే తప్పుడు ప్రచారాలను కూడా నమ్మవద్దని చెప్పారు. ఎంఎఫ్ఐఎన్ వైస్ ప్రెసిడెంట్ పీఎం కమలేష్ మాట్లాడుతూ రుణ గ్రహీతలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని, ఆర్బీఐ నియంత్రణ ఆర్థిక సంస్థల నుంచే రుణాలు పొందాలన్నారు. నకిలీ కేవైసీ కాల్స్, యూపీఐ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ఎస్.శోభన్బాబు సూచించారు. సైబర్ మోసాల బారినపడితే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. ఎంఎఫ్ఐఎన్ టోల్ఫ్రీ హెల్ప్లైన్ 1800–102–1080 సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రచార పత్రాలు విడుదల చేశారు.


