● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
లక్కవరపుకోట: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అమ్మవారి పండగలు, తీర్థాలు, జాతరలు పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిష్త్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మండలంలోని తలారి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ (సింగపూర్) ఆధ్వర్యంలో సోమవారం సత్యవమ్మ పేరంటాలు అమ్మవారి తీర్థం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా గ్రామం సమీపంలో గల సత్యవమ్మ పేరంటాలు అమ్మవారి ప్రాంగణంలో జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ స్థాయిల్లో ప్రతిభా పరీక్షలను నిర్వహించారు.ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు భారీఎత్తున నగదు బహుమతులను అందజేశారు. అలాగే జిల్లా స్థాయి కోలాటం పోటీలను నిర్వహించి మహిళలకు నగదు బహుమతి అందజేశారు. అనంతరం రాష్ట్రస్థాయి గుర్రాలు, ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుర్రాలు, ఎడ్ల బళ్ల యజమానులకు రూ.30 వేలు, రూ.25వేలు చొప్పున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేతులమీదుగా నిర్వాహకులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, కేఏ నాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొరపల్లి జయప్రకాష్ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గుమ్మడి స్వాతికుమారి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


